వనపర్తి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే వందేండ్లకు సాగునీటి గోస లేకుండా వనపర్తి జిల్లాలో నిర్మాణాలు చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో చొరవ తీసుకుని కరువును శాశ్వతంగా దూరం చేశామన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని పడమటి తండా, సల్కలాపురం, అప్పారెడ్డిపల్లి, వెంకటంపల్లి, చిలుకతోనిపల్లి, వెల్టూరు చెక్డ్యాంలను, బుద్ధారం పెద్దచెరువు, వీరాంజనేయ లిఫ్టు ఇరిగేషన్, గణప సముద్రం పునరుద్ధరణ పనులను ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగునీటి అభివృద్ధికి ఒకటిన్నర సంవత్సరంలో దాదాపు అనేక ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. వనపర్తి నియోజకవర్గానికి 11 చెక్డ్యాంలను సీఎం కేసీఆర్ మంజూరు చేయించారని స్పష్టం చేశారు. వీటిలో 9 ని ర్మించగా.. నేడు వాటి ఫలితాలతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు.
ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేలా ఎక్కడికక్కడ చెక్డ్యాంలు నిర్మించి పొలాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో కులవృత్తులకు మంచిరోజులు వచ్చాయని, మత్స్య సంపద పెరిగిందని వివరించారు. రాబోయే భవిష్యత్ తరాల కోసం తపన పడుతున్నామన్నారు. గత పాలకులు కృష్ణానీటితో ఎక రం భూమికి నీరు పారించిన దాఖలాలు లేవన్నారు. కానీ నేడు రాష్ట్రంలోనే వనపర్తి జిల్లాలో రికార్డు స్థాయి లో భూగర్భ జలాలు పెరిగి నెంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. వందకు వందశాతం సాగునీరు అందే ప్రాంతంగా వనపర్తి జిల్లా కొద్ది రోజుల్లో మారబోతున్నదని చెప్పారు. వెయ్యేండ్ల చరిత్రను తిరగరాస్తున్నామని, భవిష్యత్తు తరాలకు వరంగా ఉంటుందని పేర్కొన్నారు. రూ.76 కోట్లతో కర్నెతండా లిఫ్ట్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 216 జనావాస ప్రాంతాలు ఉండగా.. వాటన్నింటికీ సాగు, తాగునీరు అందిస్తామన్నారు. కాశీంనగర్ అనుబంధ తండాలకు కృష్ణా జలాలను పైపులైన్ ద్వారా పారిస్తామని వివరించారు.
కాశీంనగర్, రేమద్దుల, కిష్టాపూర్ గ్రామాల్లో రిజర్వాయర్ కోసం ప్ర తిపాదనలు పంపామన్నారు. చెక్డ్యాంల నిర్మాణంతో పుష్కలంగా పంటలు పండుతున్నాయని, ఈ వానకాలంలో దాదాపు 98 వేల ఎకరాల్లో వరి సాగైందన్నారు. త్వరలో జిల్లాకు వ్యవసాయ ఆధారిత, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. ఇందుకోసం శ్రీరంగాపూర్, కానాయపల్లి, నాగరాల, కంబల్లాపూర్ ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించామని వివరించారు. 100కుపైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారన్నారు. బుద్ధారం రిజర్వాయర్కు రూ.47 కోట్లు, ఘణపురం రిజర్వాయర్కు రూ.45 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
భూగర్భ జలాల లభ్యతలో నెంబర్వన్
నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, రాష్ట్రంలోనే జిల్లా నెంబర్వన్గా నిలిచిందని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటిపారుదల, వ్యవసా య రంగాల అభివృద్ధిలో జిల్లా ముందంజలో ఉన్నదన్నారు. రెండు వానకాలం సీజన్ల లో వర్షపాతం అధికంగా నమ్దైందన్నారు. పాలమూరు-రంగారెడ్డి లెఫ్ట్ కెనాల్-2, 3 కింద 52 వేల ఎకరాల ఆయకట్టు సాగు కానున్నదని వివరించారు. అలంపూర్ నియోజకవర్గం లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని, గో పాల్పేట, ఖిల్లాఘణపురంలో 37 కి.మీ. మేర నీటి వనరులు ఉన్నాయన్నారు. సమీక్షలో రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ సలహాదారు విజయ్ ప్రకాశ్, సీఈలు హమీద్ఖాన్, ర ఘునాథ్రావు, ఈఈ మధుసూదన్రావు పాల్గొన్నారు.