పెద్దమందడి, జూన్ 21 : గత తొమ్మిదేండ్లల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధించిన విజయాలే నేటి దశాబ్ది ఉత్సవాలు అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బుగ్గపల్లి, అంకాయపల్లితండా, దొడగుంటపల్లి, ముందరితండా, చీకర్చెట్టుతండా, వీరాయపల్లి, స్కూల్ తండా, వెల్టూర్ గ్రామాల్లో బుధవారం గ్రామ పంచాయతీ భవనాలు, ఆరోగ్య ఉప కేంద్రం భవనాలు, సీసీ రోడ్లు, రహదారులు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. అలాగే చిన్నమందడి, వీరాయిపల్లిలో ‘మన ఊరు-మన బడి’ కింద అభివృద్ధి చేసిన మండల పరిషత్ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో గతంలో కరెంట్ లేక అల్లాడిపోయిన రైతులకు నేడు నిరంతరం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్సేనన్నారు. గుక్కెడు నీటికోసం తల్లడిల్లిన కాలానికి స్వస్తి చెబుతూ ఇంటింటికీ నల్లా ద్వారా శుద్ధ జలాన్ని అందిస్తున్నామన్నారు. రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. గ్రామాలకు బ్రహ్మాండమైన రహదారులను ఏర్పాటు చేసుకున్నామన్నారు. రెండు, మూడు గ్రామాలకో పల్లె దవాఖానను ఏర్పాటు చేసుకోగా.. జిల్లాకేంద్రంలో 600 పడకల ఆసుపత్రిని నిర్మించుకుంటున్నామన్నారు.
ఇదంతా బీఆర్ఎస్ పాలనతోనే సాధ్యమైందన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని చెప్పారు. ప్రజలు విద్య, వైద్యానికి వృథాగా ఖర్చు చేయకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్ పాఠశాలలను ఆధునీకరించి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని గుర్తు చేశారు. జిల్లాలో 183 పాఠశాలలను పునరుద్ధరించామని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులే మంచి ఫలితాలు సాధించి ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారన్నారు. ఒకప్పుడు పల్లెల్లో పనులు లేక తల్లిదండ్రులు పట్టణాలకు వలస పోయి పిల్లలను చదువుకు దూరం చేశారని.. తెలంగాణ వచ్చాక అందరూ సొంతూరుకొచ్చి ఉపాధి పొందుతూ తమ పిల్లలను చదివించుకుంటున్నారన్నారు. ప్రస్తుతం గురుకులాల్లో సీట్లు దొరకడం లేదని వివరించారు. సాగు, తాగునీరు, విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలు పల్లె జీవనానికే ఇష్టపడుతున్నారన్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, మండల అధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, సంఘం డైరెక్టర్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణు, డీఈవో గోవిందరాజులు, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
వనపర్తి వైద్య చరిత్రలో రికార్డు
మాతా, శిశు సంరక్షణ కేంద్రం వనపర్తి వైద్య చరిత్రలోనే రికార్డు సృష్టించిందని మంత్రి అన్నారు. జిల్లాకేంద్రంలో ఒకే రోజు 28 కాన్పులు జరిగాయని, అందులో 13 సాధారణం, 15 సిజేరియన్ కాన్పులు చేసినట్లు సూపరింటెండెంట్ నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రం వైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు.