గిరిజన గూడేలు, తండాలకు పండుగొచ్చింది. ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ బతికిన గిరిజనం అటవీ భూములకు హక్కులు కల్పించడంతో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు పోడు భూముల కు చట్టబద్ధత కల్పించారు. అర్హులైన వారికి భూ పట్టాలు పంపిణీ చేశారు. దీంతో ఇక వారికి అటవీ అధికారుల భయం లేదు. పంటలు పాడు చేస్తారనే బెంగ అసలే లేదు. దశాబ్దాల కాలం నుంచి భయాందోళనల మధ్య పోడు చేసుకొని బతుకుతున్న గిరిజనుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పోడు భూములకు హక్కులు కల్పించి గిరిజనుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపారు. గిరిజనులు.. ఆదివాసీల దశాబ్దాల కల పోడు భూములకు అటవీ యజమాన్య హక్కులు కల్పించడంతో రైతుల సంబురానికి అవధుల్లేకుండా పోయాయి. తాతల కాలం నుంచి అటవీ సంపదపై ఆధారపడి బతుకుతున్న గిరిజనులకు భూమిపై హక్కులు కల్పించారు. ఏండ్ల తరబడి దున్నుకొని బతుకుతున్న ప్రతిసారి అటవీశాఖ అధికారుల నుంచి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సాగుచేసే ప్రతిసారి ఫారెస్టోళ్లు వచ్చి సాగు చేయనీయకుండా అడ్డుపడేవారు. కొన్ని సార్లు అటవీ, పోడు రైతుల మధ్య అనేక ఘర్షణలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో పోడు రైతులపై కేసులు కూడా నమోదయ్యాయి. వీరిపై ఉన్న కేసులను ఎత్తేయాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. పట్టాలు ఉన్న రైతులకు భూములపై ఎలాంటి హక్కులు ఉన్నాయో అలాంటి పూర్తిస్థాయి హక్కులను కూడా పోడు రైతులకు వర్తింపజేశారు. గూగుల్ మ్యాప్లో హక్కులు పెట్టి రైతులకు భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాసుపుస్తకాలు ఇచ్చారు. దీంతో గిరిజనులు, ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హక్కులు పొందిన రైతులు సంబురపడుతున్నారు.
రైతుబంధుకు దరఖాస్తులు
పోడు భూములకు పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు, రైతుబీమా వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం సూచించింది. దీంతో పట్టాలు పొందిన గిరిజన రైతులు రైతుబంధు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. వ్యవసాయ అధికారులకు పోడు పట్టా, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ను అందజేశారు. అందరూ రైతుల మాదిరిగానే పోడు కర్షకులకు రైతుబంధు, రైతుబీమా వర్తింపజేస్తున్నందున సీఎం కేసీఆర్ను గిరిజనులు ఆశీర్వదిస్తున్నారు. అచ్చంపేట, అమ్రాబాద్, పదర, లింగాల, చారకొండ, వంగూరు మండలాల్లో మొత్తం 1,164 మంది రైతులకు 3,006 ఎకరాలకు పట్టాలు పొందారు.
అచ్చంపేట మండలంలో..
అక్కారంలో 11 మంది రైతులు, ఆంజనేయతండాలో 11 మంది, బండతండాలో ముగ్గురు, బక్కలింగాయపల్లిలో 8 మంది, ఘనపురంతండాలో ఒక్కరు, జోగ్యతండాలో ఇద్దరు, కిష్టతండాలో 9 మంది, బొమ్మన్పల్లిలో ఇద్దరు, పుల్దేవిబండ తండాలో ఒక్కరికి రాగా మొత్తం 48 మంది రైతులు పట్టాలు పొందారు.
అమ్రాబాద్ మండలంలో
మండలంలోని 12 గ్రామాల్లో 436మంది పట్టాలు పొందారు. జంగంరెడ్డిపల్లిలో ఆరుగురు, బీకే లక్ష్మాపూర్లో 105మంది, బీకే లక్ష్మాపూర్తండాలో 143మంది, మాచారంలో ఒక్కరికి, ఫరహాబాద్లో నలుగురు, ఫరహాబాద్పెంటలో ఇద్దరికి, మల్లాపూర్లో నలుగురు, కుడిచింతలబైలులో 15 మంది, సార్లపల్లిలో 51మంది, బీకే తిర్మలాపూర్లో ఏడుగురు, బీకే ఉప్పునుంతలలో 56మంది, వటువర్లపల్లిలో 42మంది పట్టాలు పొందారు.
పదర మండలంలో..
మండలంలోని 13 గ్రామాలలో 411మంది రైతులు పట్టాలు పొందారు. అందులో చెన్నంపల్లి గ్రామంలో 96మంది రైతులు, చిట్లంకుంట గ్రామంలో 144మంది రైతులు, పెట్రాల్చేనులో 31మంది, గానుగపెంటలో 24మంది, పల్లెరూటుపెంటలో 32మంది, ఇప్పలపల్లిలో 18మంది, మద్దిమడుగులో 25మంది, బాపన్పాడులో 13మంది, మారెడుగులో నలుగురు, కోడొనిపల్లిలో ఒక్కరు, పదరలో ముగ్గురు, ఉడిమిళ్లలో 17మంది, వంకేశ్వరంలో ముగ్గురు రైతులు పట్టాలు పొందారు.
లింగాల మండలంలో..
మండలంలోని 18 గ్రామాల్లో 248 మంది రైతులు పోడు పట్టాలు పొందారు. అందులో అప్పాయిపల్లిలో ఏడుగురు, అగర్లపెంటలో ముగ్గురు, అప్పాపూర్పెంటలో 14 మంది, రాంపూర్పెంటలో ముగ్గురు, భౌరాపూర్లో 11 మంది, ఈర్లపెంటలో 19 మంది, మోడిమొల్కలలో 29 మంది, రాంపూర్లో ఏడుగురు, సంగడిగుండాలలో 10 మంది, పుల్లాయిపల్లిలో నలుగురు, చెన్నంపల్లిలో ఐదుగురు, లింగాలలో ఒక్కరు, డీసీతండాలో ఇద్దరు, ఎంసీతండాలో ముగ్గురు, రాయవరంలో 131 మంది, వడ్డేరాయవరం ఐదుగురు, శ్రీరంగాపూర్లో ఒక్కరు, ఎర్రపెంట ఐదుగురు పట్టాలు పొందారు. రాయవరంలో కొన్ని పట్టాలు పంపిణీ జరగాల్సి ఉన్నది.
చారగొండ మండలంలో..
మండలంలోని రెండు గ్రామాల్లో 14 మంది రైతులు పట్టాలు పొందారు. అందులో చారగొండలో 12 మంది, సిర్సనగండలో ఇద్దరు, వంగూర్ మండలంలోని తిప్పారెడ్డిపల్లిలో ఇద్దరు రైతులు పోడు పట్టాలు పొందారు. నియోజకవర్గంలో 1,075 మందికి పోడు పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు పొందిన రైతుల కండ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. గత ప్రభుత్వాలు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేశాయని, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్న..
మాది అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ గ్రామం. తాతల కాలం నుంచి సెల్క చేసుకొని బతుకుతున్నాం. ప్రతిసారి ఫారెస్టోళ్లు వచ్చి సతాయించేటోళ్లు. పట్టాబుక్కు లేక రైతుబంధు, రైతుబీమా వస్తలేదు. మావోళ్లకు అందరికీ వస్తుంది. మేము చాలా ఇబ్బంది పడినం. ఇప్పుడు పట్టా రావడంతో సంతోషంగా ఉంది. రైతుబంధు కోసం దరఖాస్తు కూడా చేసి సారోల్లకు ఇచ్చినం. అందరిలాగే మాకు కూడా రైతుబంధు వస్తుందంట. సీఎం కేసీఆర్ సార్ సల్లగుండాలి. ఇప్పుడు ఎవరికీ భయపడకుండా సంతోషంగా వ్యవసాయం చేసుకొని బతుకుతం.
– సోనా, లక్ష్మాపూర్