పాఠశాలలు మరింత బాగుపడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రతి జిల్లాలో వందలాది పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ యోజనతో డిజిటల్ బోధనతోపాటు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని 67 పాఠశాలలను ఎంపిక చేశారు. దీంతో బడులు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్, మే 1 (నమస్తే తెలంగాణ) పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) యోజన పథకం కింద రానున్న ఐదేండ్లలో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 67 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసింది. ఇప్పటికే స్థానిక సంస్థల నుంచి సేకరించిన, జిల్లాల్లో విద్యాశాఖ సూచించిన యూడైస్ వివరాల ఆధారంగా కలెక్టర్లు పాఠశాలలను పీఎం శ్రీకి నివేదించారు. పక్కా భవనం కలిగి ఉండి రాష్ట్ర సగటుకన్నా మించి విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలలు పీఎం శ్రీకి ఎంపిక చేశారు.
కేంద్రం ప్రతిపాదించిన 2020 నూతన విద్యా విధానం అనుగుణంగా పాఠశాలలను సెలెక్ట్ చేశారు. ప్రయోగాత్మక పద్ధతిలో విద్యార్థులకు బోధించడం, లెర్నింగ్ ఓరియంటెడ్, స్మార్ట్ క్లాసులు, అనుభవ పూర్వకంగా ఆటబొమ్మల ఆధారంగా బోధించనున్నారు. అలాగే మూత్రశాలలు, నీళ్లు, విద్యుత్, తాగునీళ్లు, ఫర్నీచర్, రంగులు, నీళ్ల లీకేజీ, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ, వంట గది, కొత్త గదులు, హైస్కూళ్లలో భోజనశాల, డిజిటల్ తరగతులు, హరితహారం, సోలార్ ప్యానళ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, పోషకాహార తోటల పెంపకం వంటి పనులు చేపడతారు.
డిగ్రీ వచ్చే వరకు విద్యార్థులు ఉపాధి పొందేలా సన్నద్ధం చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఇలా మౌలిక సదుపాయాల కల్పనతోపాటు డిజిటల్ తరగతులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మొక్క పుట్టినప్పటి నుంచి, ఎదుగుదల వరకు ఉన్న దశలను పర్చవల్ పద్ధతిలో తరగతి గదిలోనే తెలుసుకునేలా బోధిస్తారు. ఇక గ్రహాలు, సూర్య, చంద్ర మండలాల్లో మార్పులను ఆధునిక సాంకేతిక పద్ధతిలో పాఠశాలల్లో విద్యార్థికి అవగాహన కల్పించనున్నారు. ఈ క్రమంలో పాఠశాలలు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనఊరు-మనబడి పథకం ద్వారా తొలి విడుతలో భాగంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. ప్రతి జిల్లాలోనూ పలు పాఠశాలలు పునరుద్ధరించబడి కార్పొరేట్ స్థాయి వసతులతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో పీఎం శ్రీ పథకానికి ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి మరింత పెరగనున్నది. ఈ పథకం ద్వారా ఒక్కో పాఠశాలకు రూ.40లక్షలకుపైగా నిధులు ఐదేండ్లలో మంజూరవుతాయి. పాఠశాలల్లో కల్పించాల్సిన సౌకర్యాలను బట్టి గరిష్ఠంగా రూ.కోటి వరకు నిధులు మంజూరు కానున్నాయి. మొత్తమ్మీద ఉమ్మడి జిల్లాలో 67 పాఠశాలలు పీఎం శ్రీకి ఎంపికవడంతో ఆయా పాఠశాలలు ఆధునిక రూపాన్ని సంతరించుకోనున్నాయి.
నాగర్కర్నూల్లో 17 స్కూళ్లు ఎంపిక..
నాగర్కర్నూల్ జిల్లాలో పీఎంశ్రీ కింద 17 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో అచ్చంపేట ప్రభు త్వ ఉన్నత పాఠశాల, పెద్దకొత్తపల్లి, తిమ్మాజిపేట కస్తూర్భాలు, మొలచింతలపల్లి(కొల్లాపూర్), నడింపల్లి(ఉప్పునుంతల) ఎంపీపీఎస్, వెల్దండ టీఎస్ఎంఎస్, మన్ననూర్ బా లికల గురుకులం, మంగనూరు(బిజినేపల్లి), అంబట్పల్లి(లింగాల), నాగర్కర్నూల్, శ్రీపురం(నాగర్కర్నూల్), మార్చాల(కల్వకుర్తి), రంగాపూర్(అచ్చంపేట), తెలకపల్లి, ఉప్పునుంతల జెడ్పీ హైస్కూళ్లు ఎంపికయ్యాయి. పాఠశాలల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై మరోసారి నివేదిస్తాం. ఈ నివేదిక ఆధారంగా ఆయా పాఠశాలలకు నిధుల కేటాయింపులు జరుగుతాయి.
– గోవిందరాజులు, డీఈవో, నాగర్కర్నూల్