తెలంగాణ అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తొలి రోజు సలేశ్వరం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ప్రత్యేక వాహనాలు, బస్సుల్లో వచ్చి 5 కి.మీ. మేర రాళ్లూరప్పల మీదుగా ప్రయాణం సాగించారు. లోయలోని జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి లింగమయ్య స్వామిని దర్శించుకొని తన్మయత్వం
చెందారు. వస్తున్నాం.. లింగమయ్యా అంటూ నినదించడంతో నల్లమల అడవులు మార్మోగాయి. స్థానిక చెంచులు పూజారులుగా వ్యవహరించి ప్రత్యేక పూజలు చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా.. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం, తాగునీటి వసతి కల్పించగా.. వైద్య శాఖ మెడికల్ క్యాంపులను నిర్వహించింది.
లింగాల, ఏప్రిల్ 5 : తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే సలేశ్వరం జాతర బుధవారం నుంచి ప్రారంభమైంది. ఏటా చైత్ర పౌర్ణమికి ముందు నుంచి ఉత్సవాలు జరుగుతాయి. ఈసా రి కేవలం మూడు రోజులు మాత్రమే జాతర నిర్వహిస్తుండడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు తెలంగాణ, చుట్టుపక్కల రాష్ర్టాల నుంచి ప్రత్యేక వాహనాలు, బస్సుల్లో వేలాదిగా తరలివచ్చారు. అటవీశాఖ అధికాలు రాత్రివేళ ప్రయాణా న్ని నిషేధించారు.
భక్తుల సౌకర్యార్థం ఆయా డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. శ్రీశైలం వెళ్లే మార్గంలో ఫరహాబాద్ సమీపంలోని రాంపూర్ చెంచు పెంట వరకు వాహనాల్లో వెళ్లి అక్కడి నుంచి పాదయాత్రగా స్వామిని దర్శించుకున్నారు. మరో ప్రాంతమైన లింగాల మీదుగా అ ప్పాయిపల్లి, గిరిజన గూడెంల వరకు వాహనాల్లో వెళ్లి అక్కడి నుంచి 7 కి.మీ. దూరంలోని క్షేత్రానికి కాలినడకన భక్తులు చేరుకున్నారు. శివనామస్మరణ మార్మోగింది. వస్తున్నాం.. లింగమయ్యా అంటూ స్వామిని స్మరిస్తూ రాళ్లూరప్పల వెంట నడక కొనసాగించారు. లోతైన లోయలో వెలిసిన లింగమయ్య స్వామిని దర్శించుకొని పరవశించిపోయారు. స్థానిక చెంచులు పూజారులుగా వ్యవహరించి ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం, తాగునీటి వసతి కల్పించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి అట వీ శాఖ వారు ఎంట్రీ ఫీజు తీసుకుంటున్నారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.