జడ్చర్లటౌన్, అక్టోబర్ 20 : పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తిమ్మాజిపేట మండలం హనుమాన్తండాకు చెందిన మునావత్ మైనా (19) ఆత్మహత్య ఘటనపై విద్యార్థి సంఘాలు, విద్యార్థిని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. గురువారం డిగ్రీ కళాశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యార్థిని మృతికి అధ్యాపకులు, తోటి విద్యార్థుల వేధింపులే కారణమని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ అప్పీయచిన్నమ్మతో వాగ్విదానికి దిగారు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
విషయం తె లుసుకున్న సీఐలు రమేశ్బాబు, జములప్ప, హనుమప్ప పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట రాస్తారోకో చే శారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు విద్యార్థిని మృతదేహాన్ని తీసుకొచ్చి జడ్చర్ల జాతీయరహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద బైఠాయించారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకో గా ఆందోళనకారులను చెదరగొట్టారు.
విషయం తెలుసుకున్న మహబూబ్నగర్ ఆర్డీవో అనిల్, డీఎస్పీ మహేశ్, తాసిల్దార్ లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకొని విద్యార్థిని కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాల నాయకుల తో చర్చించారు. బాధ్యులపై శాఖాపరంగా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.