గద్వాలటౌన్, ఫిబ్రవరి 6 : గద్వాల కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం రాత్రి 11గంటలకు స్వామివారి రథోత్సవాన్ని మంత్రాలయ పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ శ్రీపాదుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గుంటి చెన్నకేశవస్వామి ఆలయం వరకు రథాన్ని ఊరేగించారు. మున్సిపల్ చైర్మన్ కేశవ్, కౌన్సిలర్లు, వేలాది మంది భక్తులు తరలివచ్చి తన్మయత్వం చెందారు. పీఠాధిపతి మాట్లాడుతూ కొన్నేండ్లుగా మఠం ఆధ్వర్యంలో స్వామి వారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు.
త్వరలో చారిత్రాత్మకమైన రథశాలతోపాటు వివిధ కట్టడాలను అభివృద్ధి చేస్తామన్నారు. గద్వాల చరిత్రను తెలిపే మ్యూజియాన్ని నెలకొల్పుతామని చెప్పారు. భక్తులు విరాళాలు కాకుండా నాటి పుస్తకాలు, శిల్పాలు, ప్రాముఖ్యతను చాటే శాసనాలు, రచనలు, కవిత్వాలు మఠానికి అందజేయాలని కోరారు. అంతకుముందు సాయంత్రం మంత్రాలయ పీఠాధిపతి ఆధ్వర్యంలో షేరెల్లివీధిలోని రాఘవేంద్రస్వామి మఠం నుంచి భూలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం వరకు ప్రహ్లాద రాయల ఉత్సవమూర్తులను వైభవంగా ఊరేగించారు. గురు విజయ విఠల బృందం ప్రత్యేక కీర్తనలు ఆలపించారు.
– ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రాలయ పీఠాధిపతి