Paddy cultivation | పెద్దమందడి, ఏప్రిల్ 22 : వెదజల్లే పద్ధతిలో వరి సాగు సత్ఫలితాలిస్తున్నది. అదును సమయంలో కూలీలు దొరక్క ఇబ్బంది పడే సందర్భాల్లో ప్రత్యామ్నాయం వైపు చూస్తూ వెదజల్లే పద్ధతిపై రైతులు దృష్టిసారిస్తున్నారు. ఫలితంగా కూలీల ఖర్చు మిగలడమే కాకుండా పంట కూడా ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. నాట్లు వేయడం ప్రస్తుతం పాత తరానికే పరిమితమైంది. నేటి మహిళలు నాట్లు వేసే పద్ధతిపై ఆసక్తి చూపడం లేదు. దీంతో రైతులకు కూలీల కొరత ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా సకాలంలో నాట్లు వేయకపోవడంతో దిగుబడిపై ప్రభావం చూపనున్నది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో ప్రభుత్వం కూడా వెదజల్లే పద్ధతిపై రైతులకు విస్తృతంగా ప్రచారం కల్పించడంతో అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు.
మండలంలో ఇలా..
పెద్దమందడి మండలంలో యాసంగిలో దాదాపు 300 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. పామిరెడ్డిపల్లిలో రైతులు అధిక మొత్తంలో వెదజల్లే పద్ధతిపై దృష్టి సారించారు. వానకాలం కొంతమంది రైతులు వెదజల్లే పద్ధతిన మంచి ఫలితాలు రాబట్టడంతో యాసంగిలో దాదాపు 120 ఎకరాలకు పైగా అదే పద్ధతిలో వరి సాగు చేశారు. చిన్నమందడిలో 25 ఎకరాలు, వీరాయపల్లిలో ఐదెకరాలు, గట్లఖానాపూర్లో 12 ఎకరాలు, వెల్టూర్లో 9, పెద్దమందడిలో 21, దొడగుంటపల్లిలో ఐదెకరాలు, బలిజపల్లిలో 14 ఎకరాలు, మనిగిల్లలో 21 ఎకరాల్లో వెద్దజల్లే పద్ధతిన వరి సాగు చేశారు.
నాట్లకు పెట్టుబడి ఎక్కువ..
సంప్రదాయ పద్ధతిలో నాటు వేస్తే ఎకరాకు కూలీల మొత్తం కలిపి రూ.6వేలు ఖర్చవుతుంది. డీజిల్, ఎరువుల ధరలు పెరగడంతో సాగు పూర్తయ్యే వరకు ఎకరాకు రూ.25వేల నుంచి రూ.35వేల పెట్టుబడి అవుతుంది. నాటు విధానం ద్వారా విత్తనం ఖర్చు కూడా ఎక్కువవుతుండగా.. వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 8-10 కేజీల విత్తనాలు సరిపోతాయి. నారును పెంచి మళ్లీ నాటడం వల్ల వేర్లు తెగిపోవడంతో పిలకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదు. వెదజల్లే పద్ధతిలో నేరుగా పెంచడం వల్ల దిగుబడి అధికమవుతుంది. ఈ పద్ధతిని అవలంబిస్తే పంట ఆరంభంలో మందులతో కలుపును నివారించవచ్చు. అదేవిధంగా సాధారణ సాగుకంటే 10-15 రోజుల ముందుగానే పంట కోతకు వస్తుంది. ఈ పద్ధతిపై ప్రభుత్వం కూడా విస్తృతస్థాయిలో అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహిస్తున్నది. ఏఈవోల ద్వారా రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించి వెదజల్లే, డ్రమ్ సీడర్ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. పాత కాలం వరి సాగు కంటే వెదజల్లే పద్ధతి సులువుగా ఉండడమే గాక అధిక ఆదాయం వస్తుండడంతో రైతులు అటువైపే మొగ్గుచూపుతున్నారు. సాధారణ వ్యవసాయం కంటే రూ.8వేల నుంచి రూ.10వేల వరకు పెట్టుబడి రూపంలో మిగులుతున్నది.
వెదజల్లే పద్ధతి బాగుంది
యాసంగిలో నాలుగెకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశాను. సాధారణ నాట్ల కంటే ఈ పద్ధతి చాలా సులువుగా ఉంది. సాధారణ పద్ధతికంటే వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన చెలకలే బాగున్నాయి. నాకు ప్రస్తుతం ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10వేల ఖర్చు తగ్గింది. వరి చేను కూడా ఆశించిన స్థాయిలో ఉంది. వెదజల్లే పద్ధతిలో పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నా.
– లక్ష్మణ్గౌడ్, రైతు, పామిరెడ్డిపల్లి
డ్రమ్ సీడర్ పద్ధతి కూడా..
వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు చేసుకుంటే పెట్టుబడి తగ్గడంతోపాటు దిగుబడి అధికంగా వస్తుంది. ఈ విధానంతో ఆశించిన స్థాయిలో రైతులు ఆదాయం పొందవచ్చు. ఖర్చులు తగ్గించుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం కొంతమంది రైతుల్లో మార్పును గమనించాం.
– కురుమయ్య, ఏవో, పెద్దమందడి