పాలమూరు, జనవరి 1: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకదిరలో ఆదివారం మన్యంగౌడ్ స్మారక క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందన్నారు. యువత క్రీడల్లో రా ణించి మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. కాగా టో ర్నీలో 32 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు శ్రీకాంత్, చిన్నా, రాజశేఖర్రెడ్డి, దేవయ్య తెలిపారు.
విజేత జట్టుకు రూ.25వేలు, రన్నర్ జట్టుకు రూ.15వేలు సర్పంచ్ మల్లు రమ్య ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు ఎండీ మస్తాన్, ఉపసర్పంచ్ మునీర్, మన్యంగౌడ్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.