కొల్లాపూర్, నవంబర్ 13: తెలంగాణలోనే పర్యాటకంగా ఎంతో పేరొందిన మినీ కాశ్మీర్ సోమశిల. పాపికొండలకు దీటుగా పర్యాటకుల హృదయాలను దోచుకుంటున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో లలితాసోమేశ్వరాలయం, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న సోమశిలకు ఆదివారం పర్యాటకులతో సందడిగా నెలకొన్నది. ఆదివారం సెలవు కావడంతో, కార్తీకమాసం నేపథ్యంలో మహిళలు, అయ్యప్ప భక్తులు సైతం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్, రంగారెడ్డి, నల్లొండ, సూర్యాపేట,మెదక్తో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా టూరిస్ట్, ఆర్టీసీ బస్సుల్లో కుటుంబ సమేతంగా తరలివచ్చారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సోమేశ్వరాలయం ఆవరణలో దీపారాధనలు వెలిగించి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
బోటింగ్లో ప్రకృతి అందాల వీక్షణం
రెండేండ్లుగా కరోనా కారణంగా నిలిచిపోయిన బోటింగ్ శనివారం నుంచే పునర్ప్రారంభమైంది. కృష్ణానది అలలపై బోటింగ్ చేసేందుకు పర్యాటకులు పోటీపడ్డారు. అరగంటకు రూ.50లు, గంటకు రూ.100 చొప్పును జాలీట్రిప్ పేరుతో పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్నారు. నల్లమల కొండలు..పచ్చచీర కట్టినట్లు నిటారు చెట్లు, ప్రకృతి అందాలతో పర్యాటకులు మంత్రముగ్దులయ్యారు. సెల్ఫీలతో జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు.