హన్వాడ, సెప్టెంబర్ 1 : కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతులు కూరగాయల పందిళ్లు వేసుకుంటే వారికి వందశాతం సబ్సిడీతో రుణాలు ఇస్తున్నది. నేలపై కూరగాయల పంటలు సాగు చేయడం ద్వారా దిగుబడి అధికంగా రాకపోగా, త్వరగా తెగులు సోకుతుంది. దీని వల్ల పెట్టుబడి అధికం కావడంతోపాటు దిగుబడి కూడా తగ్గుతుంది. దీంతో రైతులు అర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూరగాయల పంది రి సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఐదెకరాల్లో పు భూమి ఉన్న రైతుకు వందశాతం సబ్సిడీతో సాగు కోసం రూ.లక్ష రైతు అకౌంట్లో జమచేస్తున్నది.
మండలంలో ఇప్పుటి వరకు 25మంది రైతులు కూరగాయల పందిళ్లు వేసుకున్నారు. చిక్కుడు, దొండ, కాకర, బీర, సోరకాయ, బీర్నీస్ పందిరిపై సాగు చేస్తుండగా, పందిరి కింద టమాట, వంకాయ, బెండకాయ, క్యాబేజీ, మిరప పంటలను సాగు చేసుకుంటున్నారు. డ్రిప్తో సాగు చేయడం వల్ల తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీతో డ్రిప్ను అందిస్తున్నారు. బీసీలకు 50శాతంతో సబ్సిడీతో ఇస్తారు. గ్రామాల్లో రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సైతం కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.
పందిరి సాగుతో లాభాలు..
పందిరిపై తీగజాతి కూరగాయలు, పందిరి కింద కూరగాయలు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుంది. అన్నీ ఒకే రకంగా భూమిపై సాగు చేయడంతో రైతులు నష్టపోతారు. పందిరిపై సాగు చేస్తే తెగులు రాదు. డ్రిప్ ద్వారా తక్కువ నీటితో పంటలను సాగు చేయవచ్చు.
– వెంకటయ్య, రైతు, టంకర
రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
రైతులు అరెకరంలో కూరగాయల పందిళ్లు వేసుకుంటే వారికి ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో రూ.లక్ష ఇస్తున్నది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చేలా పంట సాగు చేసుకోవాలి. పందిళ్లు వేసుకున్న రెండు నేలల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ధనుంజయగౌడ్, ఎంపీడీవో, హన్వాడ