నాగర్కర్నూల్, జనవరి 20 : నాగర్కర్నూల్ జిల్లాలో విద్య, వైద్యంతోపాటు ఇరిగేషన్, పరిశ్రమలు, ఉపాధి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించి అన్నివిధాలుగా అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరమున్నదని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం ఆబ్కారీ, సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా ఐడీవోసీ ప్రజావాణి హాల్లో ఆయా ప్రభుత్వ శాఖల పనితీరు, సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అభయహస్తం పథకంలో 20 మండలాల్లోని 461 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి 3,41,258 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. అన్ని దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఇరిగేషన్పై సమీక్షించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4.51లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా.. నిధుల కొరత, భూ సేకరణ సమస్యల కారణంగా కేవలం 2.38లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వడానికి మరో రూ.387కోట్ల నిధులు అవసరం ఉన్నదని, అందులో రూ.350 కోట్లు భూసేకరణకు చెల్లించాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి నిధుల విడుదలకు కృషి చేస్తానన్నారు. జిల్లాలోని అసైన్డ్, దేవాదాయ శాఖ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి గత పదేండ్లలో రిజిస్ట్రేషన్ అయిన అసైన్డ్భూమి వివరాలు తెలుసుకొని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసిన వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. నిరుపేదల గృహ నిర్మాణాలకు గానూ ప్రతి గ్రామంలో భూమి కేటాయించాలని చెప్పారు. విద్యాశాఖపై డీఈవో గోవిందరాజులు వివరిస్తూ జిల్లాలో 3,730 మంది ఉపాధ్యాయులకు గానూ 530 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. 59 పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడ్డాయని మంత్రి దృష్టికి తెచ్చారు.
విద్యాశాఖకు ప్రాధాన్యత ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ గురించి చర్చిస్తూ గిరిజనులు, చెంచులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ స్పందిస్తూ ట్రామా కేర్ సెం టర్ నాగర్కర్నూల్లో ఉందన్నా రు. సిబ్బంది, నిధులు లేక ఉపయోగంలో లేదన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేటలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ఏరియా దవాఖానకు తగిన సిబ్బంది, నిధులు మంజూరు చేయాలని చెప్పారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎక్సైజ్ శాఖపై చర్చించారు. బెల్ట్ షాపులను గుర్తించి పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గంజాయితో యువత పెడదారి పడుతున్నదని, పూర్తిస్థాయిలో కట్టడికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్కు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, నారాయణరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు కలెక్టర్ కుమార్దీపక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెడికల్ విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దు..
నాగర్కర్నూల్ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు వచ్చే అకాడమిక్ నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని వైద్య, ఆరోగ్యశాఖ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శనివారం జిల్లాలోని మెడికల్ కళాశాలను రాష్ట్ర ఆబ్కారీ, సాంస్కృతిక పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కూచకుళ్ల రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల భవనాన్ని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కళాశాలలో ఉన్న మౌలిక వసతులు, అవసరమైన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు.
అంతకుముందు జిల్లా దవాఖానను సందర్శించి మౌలిక సదుపాయాలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, భోజనం, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఐసీయూ యూ నిట్, చిన్నపిల్లలు, జనరల్ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ట్రామా యూనిట్కు అవసరమైన సిబ్బంది, నిధులపై కార్యాచరణ చేపడతామని తెలిపారు. దవాఖానలో నూతన సాంకేతిక పరికరాలు ఉన్నాయని, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత వల్ల అధునాతన వైద్యం అందడం లేదని కలెక్టర్ ఉదయ్కుమార్ మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, అదనపు కలెక్టర్ కుమార్దీపక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటదాసు తదితరులు పాల్గొన్నారు.