మహబూబ్నగర్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హైదరాబాద్ మహానగరాన్ని మహా అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు టూరిజం, పర్యాటక శాఖ నడుంబిగించాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర రాజధానిలోని ట్యాంక్బండ్, దుర్గం చెరువుల వద్ద అతిపెద్ద లండన్లో మాదిరిగా పెద్ద జాయింట్వీల్, స్కైటవర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు వద్ద స్విట్జర్లాండ్ ప్రతినిధుల బృందంతో మంత్రి భేటీ అయ్యారు. బృందం మంత్రికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. తొలిదశలో దుర్గం చెరువు, ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తే వ్యూ ఎలా ఉంటుందో పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ లండన్ మాదిరిగా ఈ రెండు నిర్మాణాలను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అద్భుత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. మరిన్ని పర్యాటక సొబగులు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో కొత్త నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గూగుల్, యాపిల్ వంటి అతిపెద్ద సంస్థలు విస్తరిస్తున్నాయని, ప్రపంచస్థాయి బహుళజాతి కంపెనీలు వస్తున్నందునా రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని తెలిపారు. పర్యాటకరంగాన్ని విస్తరించాలనే కాంక్షతో సీఎం కేసీఆర్ ఇచ్చిన విజన్కు అనుగుణంగా తామంత పనిచేస్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక పరంగా హైదరాబాద్కు ప్రపంచస్థాయిలో నిలబెట్టాలన్నదే కేసీఆర్ తపన అన్నారు. అందుకనుగుణంగానే తొలిదశలో వీటి ఏర్పాటుకు స్విస్ ప్రతినిధి బృందంతో జరిపిన సమీక్ష తుదిరూపు ఇస్తామన్నారు. స్విస్కు చెందిన ఇంటామిన్ ఎమ్యుజ్మెంట్ సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, వీటిని ముఖ్యమంత్రికి అందజేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించేందుకు ఆలోచిస్తామని చెప్పారు. వీటితో రాష్ట్రంలో పర్యాటకరంగం మరింత పుంజుకోవడం ఖాయమన్నారు. ఆదాయంతోపాటు అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రెండో దశలో పాలమూరులోని మినీ ట్యాంక్బండ్, కొండ పోచమ్మసాగర్ వద్ద జాయింట్వీల్, స్కైటవర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.
జాయింట్ వీల్స్, స్కైటవర్స్ ఏర్పాటులో తమ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి చెందిందని స్విట్జర్లాండ్కు చెందిన ఇంటామిన్ ఎమ్ముజెమెంట్ రైట్స్ ఉపాధ్యక్షుడు జెరాల్డ్ స్లెండర్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో లండన్ తరహాలో అతిపెద్ద జాయింట్ వీల్స్, స్కైటవర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అంతర్జాతీయస్థాయిలో పర్యాటక రం గాన్ని అభివృద్ధి చేస్తున్న తరుణంలో తాము కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో టూరిజం ఓఎస్డీ సత్యనారాయణ, స్వర్ణముఖి రిక్రియేషన్స్ ప్రతినిధి లాస్య, ఎస్పీ నర్సింహ, డీఎఫ్వో సత్యనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.