Sericulture |పట్టు పురుగుల పెంపకం సిరులు కురిపిస్తుceన్నది. తక్కువ సమయంలోనే అధికంగా ఆదాయం సమకూరుతున్నది. రెండు ఎకరాల్లో సాగు చేస్తే ఏడాదికి 5 నుంచి 8 పంటలు తీయొచ్చు. పంట కాలం 45 రోజులు మాత్రమే కావడంతో యువ రైతులు అధికంగా మల్బరీ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మల్బరీ సాగు చేసిన ఏడాది తర్వాత ఎకరాకూ రూ.8 లక్షలనుంచి రూ.10 లక్షల రాబడి వస్తుండడంతో ‘పట్టు’కుంటే బంగారంలా మారింది. వనపర్తి జిల్లాలో రోజురోజుకూ వ్యాపారం పెరుగుతున్నది. ఇప్పటికే 60 నుంచి 70 ఎకరాల్లో సాగవుతున్నది. శిక్షణా తరగతులు నిర్వహిస్తే మరింత మంది రైతులు ముందుకొచ్చే అవకాశం ఉన్నది.
మదనాపురం, జూలై 5 : గ్రామీణ వ్యవసాయం లో పేదరికాన్ని తొలగించి రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించడంలో పట్టుపరిశ్రమ ము ఖ్యపాత్ర పోషిస్తున్నది. ఎక్కువ పెట్టుబడి అవస రం లేకుండా తక్కువ నీటి వినియోగంతో క్రమం తప్పకుండా నికర ఆదాయం అందజేయడం పట్టు పరిశ్రమ ప్రత్యేకత. మల్బరీతోటను రెండు ఎకరా ల్లో సాగుచేస్తే ఏడాదికి 5 నుంచి 8 పంటలు తీయవచ్చు. ఒక పంటకాలం 45రోజులు మాత్రమే. మూడు నుంచి ఐదు ఫీట్ల ఎత్తు వరకు తోట ఎదుగుదల ఉంటుంది. ఎకరా ఆకు దిగుబడిని బట్టి 2 నుంచి మూడువందల వరకు పట్టు గుడ్లు తెచ్చుకోవచ్చు. పట్టు పరిశ్రమ వ్యవసాయ ఆధారితమైనది.
ఇందులో మహిళల భాగస్వామ్యం 60శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. తోట నుంచి అధిక ఆకు దిగుబడి సాధించగలిగితే ఎక్కువ సంఖ్యలో పట్టు గుడ్ల ను వినియోగించుకోవచ్చు. తద్వారా ఎక్కువ పట్టుగూళ్లు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆకు నా ణ్యత గణనీయంగా ఉంటే వ్యాధులను ఎదుర్కొనే శక్తి పట్టు పురుగులకు సమకూరుతుంది. తద్వారా పంట నష్టాన్ని నివారించడమే కాకుండా నాణ్యమై న పట్టుగూళ్లను పండించుకొనే అవకాశం ఉంటుం ది. పట్టు పురుగుల పెంపకం పరిశుభ్రమైన రోగరహిత వాతావరణంలో మంచి స్థలాన్ని ఎంచుకొని వాతావరణ నియంత్రణ పాటిస్తూ నిర్వహించగలిగితే పంట సఫలీకృతమై అధిక పట్టుగూళ్ల దిగుబడితో ఆదాయానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.
నర్సరీ (నారుమొక్కల) పెంపకం..
ఎకరాకు లక్షా అరవైవేల మల్బరీ కడ్డీలు నాటితే, 10శాతం వృథా అయినప్పటికీ, దాదాపు లక్షా నలబైవేల నారు మొక్కలను పొందవచ్చు. నేల.. 6.5 నుంచి 6.8 ఉదజని సూచిక గల ఎర్రరేగడి నేలలు అనువైనవి. ఋతువు.. చలికాలం తప్ప (నవంబర్-జనవరి), ఎప్పుడైనా నారు మొక్కలు పెంచుకోవచ్చు. వర్షాకాలానికి ముందుగా ఫిబ్రవరి, మార్చి చాలా అనుకూలం.దున్నడం.. మల్బరీ మొక్కల వేర్లు చాలా లోతుగా వెళ్లే స్వభావం కలిగినవి. 30 నుంచి 35 సెం.మీ. లోతుగా భూమిని దున్నాలి.
సేంద్రియ ఎరువులు.. దున్నటానికి ముందు మొదటి విడుతగా ఎకరానికి 8మెట్రిక్ టన్నుల చొప్పున సేంద్రియ ఎరువులు వాడాలి.
నారు మళ్లు.. 3 మీటర్ల పొడవు, మీటరు వెడల్పు ఉన్న నారు మళ్లను తయారు చేసుకోవాలి. ప్రతి నారు మడి చుట్టూ 1 నుంచి ఒకటిన్నర అడుగు నిడివి ఉన్న నీటి కాలువలు తయారు చేసుకోవాలి. ఎకరంలో 1,065 నారుమళ్లు, ప్రతి నారుమడిలో 150 పుల్లల చొప్పున ఎకరానికి 1.60 లక్షల పుల్లలు నాటుకోవచ్చు.
కలుపు నివారణ.. కడ్డీలు నాటడానికి 10-15 రోజుల ముందు తవ్వి కలుపు మొక్కలనుఏరివేయాలి.
విత్తనపు కడ్డీలు.. 6 నుంచి 8 నెలల వయసు గల కొమ్మలతో, పైనున్న లేత భాగాన్ని, కింద ఉన్న ముదిరిన భాగాన్ని తీసివేసి, మధ్య భాగము నుంచి కడ్డీలను తీసుకోవాలి. ప్రతి కొమ్మ నుంచి 6-8 అంగుళాల పొడవుతో కడ్డీలను తయారు చేయాలి. అవసరమైతే ఒక వారం వరకు పుల్లలను తడి గోనెసంచిలో చుట్టి నిల్వ చేసుకోవచ్చు.
విత్తనపు శుద్ధి.. కడ్డీలను నాటేందుకు ముందు, శిలీంధ్ర రోగ నివారణకు, 0.1 శాతం డైథేన్ ఎం-45 (లీటరు నీటికి గ్రాము) ద్రావణంలో లేదా 1శాతం నవీన ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టాలి.
స్థలావకాశం.. నారుమళ్లలో రెండు వరుసలకు నడుమ 8 అంగుళాలు, వరుసలోని పుల్లలకు నడుమ 4 అంగుళాలు ఉండేలా నాటుకోవాలి.
నాటుట.. కడ్డీలు నాటేటప్పుడు కడ్డీ పైభాగంలోని ఒక మొగ్గ భూమిపైకి ఉండేటట్లు నిటారుగా నాటుకోవాలి. నాటిన వెంటనే నీరు పెట్టాలి.
కలుపు తీయుట.. 30 నుంచి 40 రోజుల తరువాత మొదటిసారి, 60రోజుల తరువాత 2వ సారి కలుపు తీయాలి. కలుపు తీసేటప్పుడు కడ్డీలు కదిలిపోకుండా జాగ్రత్త వహించాలి.
డ్రిప్ సిస్టం అవసరం
మల్బరీ తోటలో నీటి వినియోగం తగ్గించడానికి రైతులు ముఖ్యంగా డ్రిప్ సిస్టం పద్ధతిని ఎంచుకోవాలి. తద్వారా నీరు నేరుగా చెట్టుకు చేరి ఏపుగా పెరుగుతుంది. దీంతో ఆకు మంచి దిగుబడి వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అధిక దిగుబడి ఇచ్చు మల్బరీ వంగడం (వీ1) వెరైటీ. ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణం లోతైన వేరు వ్యవస్థ, నిటారుగా, వేగంగా పెరిగే కొమ్మలను కలిగి ఉంటుంది. ఆకులు అండాకారంలో వెడల్పుగా మందంగా, మృదువుగా ముదురు ఆకుపచ్చ రంగులో తళతళలాడుతూ ఉంటాయి. ఆకులు పోషకాలను కలిగి తేమను ఎక్కువ కాలం నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
సేంద్రియ ఎరువులు వాడాలి..
మల్బరీ తోటల పెంపకంలో రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు వాడితే మంచిది. ఎకరానికి 10 టన్నుల సేంద్రియ ఎరువును వాడితే ఏడాదికి 20-25 టన్నుల ఆకు దిగుబడి పొందవచ్చు.
షెడ్డు నిర్మించుకోవాలి..
షెడ్డు నిర్మించుకోవడం వల్ల పంట నాణ్యత, దిగుబ డి పెరిగి రైతుకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది. 50ఫీట్ల పొడవు, 20ఫీట్ల వెడల్పు, 15ఫీట్లు ఎత్తు ఉండేలా చూసుకోవాలి. ఈ షెడ్డులో ప్రతి 10 ఫీట్ల కు పైన ఒకటి, కింద ఒక వెంటిలేటర్, మధ్య భాగం లో కిటికీ ఏర్పాటు చేసుకోవాలి. షెడ్డు నిర్మాణానికి సుమారు రూ.5-6 లక్షల ఖర్చు అవుతుంది. పట్టుపరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.రెం డులక్షల సబ్సిడీ ఇస్తుంది. చంద్రికలు, సెల్ఫ్ నిర్మా ణానికి అదనంగా రూ.35వేలు రాయితీ ఇస్తుంది.
పట్టుపురుగుల పెంపకం..
వీటి పెంపకానికి 25 నుంచి 27 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, 80-90 శాతం తేమ అవసరం. ఒక పురుగు 3 నుంచి 5 వందల గుడ్లను పొదుగుతుంది. గుడ్డు పెట్టిన రోజు నుంచి 9-10 రోజుల్లో లార్వా బయటకు వస్తుంది. 3-4 రోజుల వరకు లేత ఆకును వేయాలి. 24గంటల వరకు పురుగు నిద్రావస్థలో ఉంటుంది. దీనిని మొదటి జ్వరం అని అంటారు. 6-8 రోజు వరకు 20గంటలు రెండో జ్వరంలో ఉంటుంది. 9-11రోజుల మధ్య మూడో జ్వరం 24గంటల పాటు ఉంటుంది. 13-16 వరకు రెండ్రోజుల పాటు నిద్రావస్థలో ఉంటుంది. ఆ తరువాత ఏడు రోజులపాటు ఆకును తిని పట్టుగూడును అల్లుకుంటుంది. దీంతో రైతుకు ఎకరాకు రూ.8-10 లక్షల వరకు నికర ఆదాయం వస్తుంది.
పట్టుసాగుకు మొగ్గుచూపాలి
ప్రస్తుత కాలంలో రైతులు ఒకే రకమైన పంటలు సాగు చేస్తూ దిగుబడి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరికి బదులు పట్టు సాగుపై దృష్టి సారిస్తే లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే వనపర్తి జిల్లాలో యువ రైతులు పట్టుపురుగుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం తరఫున వీరికి శిక్షణ తరగతులు నిర్వహిస్తే, చాలామంది ముందుకొచ్చే అవకాశం ఉంది. వనపర్తి జిల్లాలో ఇప్పటికే 60-80 ఎకరాల్లో మల్బరీ సాగు అవుతున్నది.
ప్రోత్సహిస్తే బాగుంటుంది
నాకున్న రెండెకరాల్లో మల్బరీ తోట సాగు చేస్తున్న. పొలంలోనే షెడ్డు నిర్మించి పట్టు పురుగులను పెంచుతున్న. నేను, నా భార్య ఇద్దరం పని చేస్తాం. గుడ్లు తెచ్చిన దగ్గర నుంచి వాటిని పెంచి పట్టు కండెలు అమ్మేవరకు నా భార్య సహకరిస్తుంది. ఖర్చులన్నీ పోను ఏడాదికి సుమారు రూ.6-7 లక్షల ఆదాయం వస్తుంది. ఈ పట్టు సాగు చాలా బాగుంది. అధికారులు సహకరించి ప్రోత్సహిస్తే పట్టు సాగుకు మరింత మంది ముందుకొస్తారు.