నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ) /వనపర్తి టౌన్, జనవరి 20 ; ప్రభుత్వ బడుల్లో ఎన్నికల గంట మోగనున్నది.పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 29న ఎన్నికలు నిర్వహించేందుకు శనివారం విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. చేతులెత్తే విధానంలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో స్కూళ్లల్లో తల్లిదండ్రులు భాగంకానుండడంతో సర్కారు విద్యపై పర్యవేక్షణ మరింత పెరగనున్నది. హెచ్ఎంల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారంతా జాబితాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3వేలకుపైగా గవర్నమెంట్ పాఠశాలల్లో ఎస్ఎంసీ సందడి నెలకొన్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా పాఠశాలల యాజమాన్య కమిటీల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పాఠశాలలో ఈ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వం పేదల కోసం ప్రభుత్వ పాఠశాలలకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నది. అధికారుల అజమాయిషీ కూడా నిర్వహిస్తోంది. అయినా ప్రజలను భాగం చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. దీనికోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నెలాఖరులోగా ప్రతి పాఠశాలకు యాజమాన్య కమిటీల రూపంలో ప్రజలు భాగం కానున్నారు. చివరగా గత 2019లో పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక లు జరిగాయి. అయితే కరోనా కారణంగా అప్పటి నుంచి నూతన కమిటీల ఏర్పాటు జరగలేదు.
ఈ స్థానంలో ఆయా కమిటీల కాలపరిమితిని పొడిగిస్తూ రావడం జరిగింది. ఎట్టకేలకు ప్రస్తుత ప్రభుత్వం యాజమాన్య కమిటీల నిర్వహణకు సిద్ధం కావడంతో గ్రామాలు, పట్టణాల్లోని పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు క న్వీనర్గా వ్యవహరించనున్నారు. ఇం దుకోసం తల్లిదండ్రుల జా బితాను హెచ్ఎంలు రూపొందిస్తున్నారు. కమిటీ ఎన్నికైన తర్వాత ప్రతి రెండు నెలలకోసారి పాఠశాలలో సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. పాఠశాలల పనితీరు, నిధులకు సంబంధించిన ఖర్చులను పరిశీలించనున్నారు. పాఠశాల వార్షిక ఆదాయం, ఖర్చుల వివరాలను రూపొందించి క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుంది. పాఠశాలల్లో అడ్మిషన్ పొందిన పిల్లలు నిత్యం బడికి వచ్చేలా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది.
ఎన్నికల విధానం
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో తరగతుల మేరకు కమిటీల నియామకం ఉం టుంది. ఈ ఎన్నికల్లో ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు అవకాశం కల్పించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కన్వీనర్లుగా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సమయంలో 50శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కావాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ మంది హాజరైతే ఓటింగ్ వాయిదా వేయనున్నారు. సభ్యులను ఎన్నుకునే సమయంలో తల్లి లేదా తండ్రికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. చేతులు ఎత్తే పద్ధతితోపాటు నోటితో చెప్పడం, ఏమైనా సమస్యలు ఏర్పడితే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యుల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్, తరగతి నుంచి ఎన్నికైన ముగ్గురు తల్లిదండ్రులు(సభ్యులు), ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులుగా కొనసాగనున్నారు. ఇందులో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్త, మహిళా సమాఖ్య సభ్యురాలికి ప్రాతినిథ్యం ఉంటుంది. ప్రత్యేక ఆహ్వానితులుగా గ్రామాల్లో సర్పంచులు, మున్సిపాల్టీల్లో చైర్మన్లు ఉంటారు. కాగా చైర్మన్, వైస్ చైర్మన్లు ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి.
సభ్యుల కాల పరిమితి రెండేళ్లు ఉంటుంది. సభ్యుడిగా కొనసాగుతున్న తల్లిదండ్రుల కుమారుడు, కుమార్తె పాఠశాల నుంచి వెళ్లిపోతే పదవీ కాలం అప్పటితోనే ముగియనున్నది. కమిటీల ఎన్నికలకుగానూ నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. దీని ప్రకారం రూపొందించిన మేరకు ఈనెల 22, 23వ తేదీల్లో తల్లిదండ్రుల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, పరిష్కరిస్తారు. 24న ఉదయం 11 గంటలకు తల్లిదండ్రుల తుది జాబితా ప్రకటించి, ప్రదర్శిస్తారు. ఇక 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించి గెలుపొందిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను పూర్తి చేసి కొత్త కమిటీని ప్రకటిస్తారు. అనంతరం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నూతన విద్యా కమిటీ తొలి సమావేశం నిర్వహిస్తారు. ఇలా పాఠశాలల్లో యాజమాన్య కమిటీల ఎన్నికను నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్లో 859 పాఠశాలలు, నాగర్కర్నూల్లో 848 పాఠశాలలు, జోగుళాంబ గద్వాలలో 475 పాఠశాలలు, నారాయణపేటలో 511 పాఠశాలలు, వనపర్తిలో 508 పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
విద్యా కమిటీల విధులు
విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్తోపాటు ఇతర సభ్యులు అందరూ కలిసి బడిలో పిల్లల పేర్ల నమోదు, హాజరు, పరిసరాల పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పన, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేత, గ్రంథాలయ, ఆట స్థలాల ఏర్పాటు, నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల ప్రగతిని సమీక్షించాల్సి ఉంటుంది. పాఠశాలల్లో సదుపాయాల కల్పన, అభివృద్ధికి విరాళాలను దాతల నుంచి సేకరించి అభివృద్ధికి తోడ్పడనున్నారు. ‘పడే భారత్-బడే భారత్’ పథకంలో భాగంగా ప్రాథమిక తరగతుల బాలబాలికలకు భాషా నైపుణ్యాలు, గణిత శాస్ర్తాల కార్యక్రమాలపై అవగాహనతో చదవడం, రాయడం, లెక్కలపై ఆసక్తి కల్పిస్తూ నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించనున్నారు.
ఇలా బడుల బాగుకోసం కమిటీలు బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. సభ్యత్వం ఇలా..
కమిటీల నిర్వహణలో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. 1-5వ తరగతి వరకు 15 మంది సభ్యులు ఉండనుండగా 10 మంది మహిళలు, 5 మంది పురుషులు ఉండాలి. ప్రతి ముగ్గురిలో జనరల్-1, ఎస్సీ, ఎస్టీ-1, బీసీ, మైనార్టీ-1. 1-7వ తరగతి వరకు 21 మంది సభ్యులు ఉంటే మహిళలు 14 మంది, పురుషులు ఏడుగురు ఉంటారు. 1-8వ తరగతి వరకు 24 మంది ఉంటే.. 16 మంది మహిళలు, 8 మంది పురుషులు. 6-8వ తరగతి వరకు 9 మందికిగానూ ఆరుగురు మహిళ లు, ముగ్గురు పురుషులు ఉండేలా హెచ్ఎంలు చూడాలి.
29న ఎన్నికలు
ప్రభుత్వ నిర్ణయంతో విద్యాశాఖ ఆదేశానుసారం పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల తల్లిదండ్రుల జాబితాను తయారు చేస్తున్నాం. 29న యాజమాన్య కమిటీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– పర్వత్రెడ్డి, హెచ్ఎం, నాగర్కర్నూల్ జిల్లా