పెద్దకొత్తపల్లి, డిసెంబర్ 26 : సమైక్య రాష్ట్రంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ప్రపంచానికి తెలియకుండా చేశారని, తెలంగాణ ఏర్పడ్డాక ఆ మహనీయుడి స్ఫూర్తితో సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆయన అడుగుజాడల్లో బీఆర్ఎస్ సర్కార్ పయనిస్తుందన్నారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలకేంద్రంలో జై గౌడ్ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వాయి పాపన్న యావత్ తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణమన్నారు. కులవృత్తుల వారు, రైతులు పన్నులు చెల్లించాలని ఉన్న దుర్మార్గమైన పరిపాలనకు స్వస్తి పలకాలని.. బడుగు, బలహీన వర్గాల ప్రజలను చైతన్యపరిచి సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తు చేశారు. 33 కోటలను జయించి, రాజుల సంపదను కొల్లగొట్టి పేదలకు పంచిన యోధుడు సర్వాయిపాపన్న అని పేర్కొన్నారు.
మాజీ డీజీపీ పేర్వారం రాములు సోదరుడు పేర్వారం జగన్నాథం లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పాపన్న విగ్రహాన్ని చూసిన తర్వాత 2003లో ఆయనపై ఓ పుస్తకాన్ని ప్రచురించినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. కులవృత్తులపై ఆధారపడిన వారికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఎన్నో ఏండ్లుగా గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించారన్నారు. చెట్టు పన్ను రద్దుతోపాటు పదేండ్లకోసారి లైసెన్స్ రెన్యూవల్, నీరా పాలసీతో కల్లు వృత్తిపై ఆధారపడిన వారికి అండగా నిలుస్తున్నామన్నారు. రూ.20 కోట్లతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుపై నీరాకేఫ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.500 కోట్ల విలువైన భూమిని గౌడ భవన నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే భవన పనులు ప్రారంభిస్తామన్నారు. కులవృత్తిదారులపై వేధింపులు లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్దేనని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల పెన్నిధి సీఎం కేసీఆర్ అని అన్నారు. కొల్లాపూర్లో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం, రూ.10 లక్షల నిధులు అందించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జై గౌడ్ ఉద్యమం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వట్టికూర రామారావుగౌడ్, నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గుండ్రాతి నారాయణగౌడ్, గౌడ సంఘం తాలూకా అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, ఎంపీపీలు శ్రీనివాస్గౌడ్, ప్రతాప్గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు రాజేందర్గౌడ్, బాలరాజుగౌడ్, మహబూబ్నగర్ జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, విగ్రహదాత ప్రసాద్గౌడ్, జై గౌడ సంఘం సభ్యులు ఉదయగౌడ్, అశోక్గౌడ్, లచ్చాగౌడ్, యుగంధర్గౌడ్, చంద్రశేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.