వనపర్తి జిల్లాకే తలమానికం సరళాసాగర్. ప్రాజెక్టు ఆటోమెటిక్ సైఫన్ సిస్టంతో ఆసియాలోనే మొదటిదిగా పేరొందింది. ఈసారి వరద ఉవ్వెత్తున రావడంతో 10 సార్లు సైఫన్లు తెరుచుకున్నాయి. పది గ్రామాలకు సాగునీరు అందుతుండగా.. 4200 ఎకరాల ఆయకట్టుకు భరోసా ఏర్పడింది. ఇక్కడి అందాలను తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తే జిల్లాకు వరంగా మారనున్నది.
మదనాపురం, అక్టోబర్ 12 : ఆసియా ఖండంలో ఆటోమెటిక్ సైఫన్లతో దిగువకు నీటిని విడుదల చేసే మొట్టమొదటి ప్రాజెక్టుగా సరళాసాగర్ రూపుదిద్దుకున్నది. 0.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 17 ఉడ్ సైఫన్లు, 4 ప్రైమరీ సైఫన్లు ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ను నిర్మించారు. దీని ద్వారా వనపర్తి జిల్లాలోని 10 గ్రామాల్లో 4,200 ఎకరాల ఆయకట్టకు సాగునీరందుతుంది. ఒక్కో ఉడ్ సైఫన్ నుంచి 3,440, ప్రైమరీ సైఫన్ నుంచి 500 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతాయి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కృషితో 2020-2022 వరకు ఏటా సైఫన్లు తెరుచుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు పది సార్లు ఆటోమెటిక్గా సైఫన్లు తెరుచుకున్నాయి.
సరళాసాగర్ నేపథ్యం..
వనపర్తి చివరి సంస్థానాధీశుడు రాజారామేశ్వర్రావు హయాంలో సాగునీరందించేందుకుగానూ 1949 సెప్టెంబర్ 15న సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రూ.35 లక్షల వ్యయంతో 1959 మే 1న నిర్మాణం పూర్తిచేశారు. 1959 జూలై 26 అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి నర్సింగరావు మొదటిసారిగా కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. 1960లో మొదటిసారిగా సైఫన్లు తెరుచుకున్నాయి. ఆ తరువాత వరుసగా మూడేండ్లు భారీ వర్షాలు కురవడంతో 1963 వరకు సైఫన్లు ఓపెన్ అయ్యాయి. 1964లో అతి భారీ వర్షాలతో శంకరసముద్రం ఆనకట్టకు గండిపడి.. సరళాసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో కుడి ఆనకట్ట తెగిపోయింది. ఈ క్రమంలో నీటి ఉధృతి తట్టుకునేలా అలుగు ఏర్పాటు చేశారు. ఆ తరువాత 1967 నుంచి 70 వరకు వరుసగా, 1974-81, 1988, 90, 91, 93, 98, 2009లో సైఫన్లు తెరుచుకున్నాయి. 2019 డిసెంబర్ 31న సైఫన్లు తెరుచుకునే సమయంలో ప్రాజెక్టు ఎడమ పక్కన ఉన్న కట్ట బలహీనపడి తెగిపోయింది. దీంతో ప్రజలంతా నిరాశకు గురయ్యారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం యుద్ధ ప్రాతిపదికన కేవలం ఏడు నెలల్లోనే ఆనకట్టను పునరుద్ధరించి రైతులకు సాగునీరందించారు.
ప్రాజెక్ట్ సామర్థ్యం..
సరళాసాగర్ ప్రాజెక్టును 0.5 టీఎంసీల కెపాసిటీతో నిర్మించారు. 771 ఎకరాల్లో 1,372 మెట్రిక్ క్యూబిక్ ఫీట్లలో ప్రాజెక్టు విస్తరించి ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1089 అడుగులు కాగా, 1089.25 అడుగుల వరకు నీరు చేరితే ఆటోమెటిక్గా సైఫన్లు తెరుచుకుంటాయి. ప్రాజెక్టు బెడ్ లెవల్ 1054 అడుగులు ఉండగా.. 1067 అడుగులకు నీరు చేరితే ఎడమ కాలువ నుంచి, 1072 అడుగులకు చేరితే కుడికాలువకు నీరు విడుదలవుతుంది. ఎడమ కాలువ ద్వారా 82 క్యూసెక్కుల నీరు విడుదలై.. 16 కిలోమీటర్లపాటు ప్రవహించి ఎనిమిది గ్రామాల్లోని 3,769.20 ఎకరాలకు సాగునీరందుతుంది. కుడి కాలువ ద్వారా 6.89 కూసెక్కుల నీరు విడుదలై.. 4.50 కి.మీ.పాటు ప్రవహించి రెండు గ్రామాల్లోని 388.22 ఎకరాలకు సాగునీరు చేరుతుంది.
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి..
ఉమ్మడి పాలనలో సరళాసాగర్ ప్రాజెక్టు ఎలాంటి అభివృద్ధి కి నోచుకోలేదు. రైతులకు ఒక్క పంటకు సాగు నీరందించేందుకే వ్యయప్రయాసలు పడేవాళ్లం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువా త సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స హకారంతో మూడేండ్లుగా రెం డు పంటలకు సాగునీరందిస్తున్నాం. 2020-2022 వర కు ఏటా సైఫన్లు తెరుచుకుంటున్నాయి. ప్రాజెక్టు ప్రాం తంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటున్నది. సరళాసాగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుంది.
– వెంకటయ్య, నీటి తీరువా సంఘం అధ్యక్షుడు, రామన్పాడు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం..
సైఫన్లు తెరుచుకున్నప్పుడు అ న్ని జాగ్రత్తలూ తీసుకుంటు న్నాం. ప్రాజెక్టు పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చే స్తూ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తో పర్యవేక్షిస్తున్నాం. సరళాసాగర్ ప్రాజెక్టు ఆహ్లాదకరమైన ప్రాంతం. పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ప్రాజెక్టు అన్ని హంగులతో పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. – రనీల్రెడ్డి, ప్రాజెక్టు జేఈ