కొల్లాపూర్, డిసెంబర్ 7 : కృష్ణానదిలో నీటిమట్టం క్రమేణా తగ్గుముఖం పట్టింది. నదికి వరద రాకతో జూలై 18వ తేదీన కృష్ణానది గర్భంలోకి సంగమేశ్వర ఆలయం వెళ్లింది. అయితే నదిలో నీటిమట్టం క్రమంగా తగ్గుతుండడంతో ఆలయ శిఖరంపై ఉన్న జెండా క్రమంగా బయటపడుతున్నది.
దీంతో ఆలయ ప్రధానాచార్యులు తెలకపల్లి రఘురామశర్మ బుధవారం ఆలయం నీట మునిగిన ప్రాంతానికి జాలర్ల సాయంతో పుట్టిలో చేరుకున్నారు. ఆలయ శిఖరంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపై కృత్తికా దీపం వెలిగించారు. అరుణాచలం, తిరుమలలో నిర్వహించే కృత్తికా దీపోత్సవంలో భాగంగా దీపాన్ని వెలిగించినట్లు రఘురామశర్మ తెలిపారు.