వంగూరు, డిసెంబర్ 2 : చిన్న వివాదంతో మనస్తాపం చెందిన బావబామ్మర్దులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్కర్నూరల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో శుక్రవారం చోటు చేసుకున్నది. ఎస్సై కురుమూర్తి కథనం మేరకు కొండారెడ్డిపల్లికి చెందిన మారెడు మల్లయ్య(55) తల్లి కొన్ని నెలల కిందట మృతి చెందింది. తల్లి పేరిట వేరే వాళ్లకు అప్పు కింద ఉన్న రూ.లక్ష నోట్, రెండు తులాల బంగారానికి సంబంధించి అతడి అన్న రాములుకు పంపకాల్లో వివాదం చోటు చేసుకున్నది. దీంతో బంగారాన్ని గ్రామానికి చెందిన వీరి మేనబావ ముచ్చింతల అంజయ్య(58) వద్ద ఉంచారు.
గురువారం ఇదే విషయంపై మల్లయ్యతో అన్న రాములు, వదినలు గొడవపడ్డారు. మల్లయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న అంజయ్య స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేశావని మల్లయ్యను కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన మల్లయ్య శుక్రవారం రాత్రి హైదరాబాద్లో ఉన్న కొడుకుకు సమాచారం ఇచ్చాడు. తర్వాత పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న అంజయ్య కూడా శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మల్లయ్యకు భార్య, ఇద్దరు పిల్లలుండగా,అంజయ్యకు భార్య ,ముగ్గురు పిల్లలున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.