నాగర్కర్నూల్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో రైతులకు పథకాలు స్వర్ణయుగాన్ని తలపించేలా అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వ్యవసాయం.. దాన్ని నమ్ముకున్న రైతులు సంబురంగా సేద్యం చేసుకుంటున్నారు. పెండింగ్లో ఉన్న ఎంజీకేఎల్ఐ వంటి ప్రాజెక్టులు పూర్తి చేయగా.. మిషన్ కాకతీయతో చెరువులకు పునరుజ్జీవం పోశారు.
ఈక్రమంలో రైతుబంధు, వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్, రైతువేదికలు, కల్లాలు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచడం, పండించిన ధాన్యాన్ని సొంతూళ్లలోనే అమ్ముకునేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. దీంతో రైతులు వ్యవసాయంపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా మారుమూల ప్రాంతాల్లోని భూములు సైతం వరి, వేరుశనగ పంటలతో పచ్చని మాగాణుల్లా దర్శనమిస్తున్నాయి. సాగు చేస్తున్న క్రమంలో అన్నదాత ప్రమాదవశాత్తూ మరణిస్తే నేనున్నానంటూ భరోసా కల్పించేలా సీఎం కేసీఆర్ 2018లో రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారు.
నాటి నుంచి ఈ పథకం వల్ల జిల్లాలోని వేలాది రైతు కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. షార్ట్ సర్క్యూట్, రోడ్డు ప్రమాదం, పాముకాటు ఇలా ఏ కారణంతో మృతి చెందినా రూ.5లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీంతో బాధిత రైతు కుటుంబానికి బీమా ఆసరాగా నిలుస్తోంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ సాయం నేరుగా రైతు కుటుంబీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నది. రైతు చనిపోయిన ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా, ఎవరికీ రూపాయి చెల్లించే అవసరం లేకుండా నేరుగా నామినీ ఖాతాలో రైతుబీమాను జమ చేస్తున్నారు.
భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా 18ఏండ్లు నిండి 59 ఏండ్ల వరకున్న రైతులందరికీ ఈ పథకం వర్తిస్తోంది. పథకం ప్రారంభమైన తొలుత ఒక్కో రైతుకు రూ.2,271.50 చొప్పున ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించగా 2019 నుంచి రూ.3,555.94 చొప్పున చెల్లిస్తోంది. ఈ పథకం వల్ల బాధిత కుటుంబాలు ఏదో రకంగా ఉపాధి పొందుతున్నాయి. ఇలాంటి గొప్ప పథకంలో ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న రైతులతోపాటు కొత్తగా 18ఏండ్లు నిండి పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు బీమా పథకంలో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.
ఈ నెల 10వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు రైతుబీమాకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. దీనికోసం రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్స్లను ఏఈవోలకు అందించి వివరాలు నమోదు చేసుకోవాలి. తమ నామినీల బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్లు కూడా అందించాలి. ఆధార్కార్డులో ఉన్న విధంగానే పట్టాదారు పాసుపుస్తకంలో వివరాలు ఉండాలి. లేకుంటే సరిచేసుకొని అందజేయాల్సి ఉంటుంది. వ్యవసాయం చేస్తూ పట్టాపాసు పుస్తకం కలిగిన ప్రతి రైతుకూ బీమా కల్పించాలని ప్రభుత్వం కొత్త దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నది. ఈ విషయంపై గ్రామాల్లో ఏఈవోల ద్వారా అవగాహన కల్పించేలా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటున్నది.
ఆగస్టు 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం
18 నుంచి 59ఏండ్ల వయస్సున్న ప్రతి రైతుకూ రైతుబీమా పథకం వర్తిస్తుంది. రైతు చనిపోతే నామినీ బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం జమ చేస్తున్నది. రైతులు ఈనెల 10వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆధార్, బ్యాంక్, పాసుపుస్తకాల జిరాక్స్లు అందించి తమ వివరాలు నమోదు చేయించుకోవాలి. గ్రామాల్లో ఏఈవోల ద్వారా ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు రైతుబీమా పథకం ద్వారా 4,323మంది రైతు కుటుంబాలకు రూ.216కోట్లు సాయం అందింది.