అయిజ, ఫిబ్రవరి 12 : పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శునకాల పరుగు పోటీలు ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శునకాలకు పరుగు పందెం నిర్వహించారు. ఈ పోటీలకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి 18 శునకాలు తరలివచ్చాయి. పోటీల్లో బొమ్మను నోట పట్టుకునేందుకు కుక్కలు పోటీ పడ్డాయి. ఏ కుక్క నిర్దేశిత ప్రాంతాన్ని దాటి బొమ్మను పట్టుకుందో విజేతలుగా నిర్ణయించారు. పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు.
కర్ణాటక రాష్ట్రం ఇండి జిల్లాకు చెందిన వీఐపీ లల్యా డాగ్ మొదటి స్థానంలో నిలువగా రూ.15,016, కర్ణాటక ఇండి జిల్లాకు చెందిన సుల్తాన్ డాగ్ రెండో స్థానంలో నిలువగా రూ.10,016, ఇండి జిల్లా తేజకళ డాగ్ మూడో స్థానంలో నిలువగా రూ.8,016, బాపురం గ్రామానికి చెందిన అంజి డాగ్ నాలుగో స్థానంలో నిలువగా రూ.5,016 నగదు బహుమతిని అందజేశారు.