ఉరుకులు, పరుగుల మీద బస్టాండ్ కు వెళ్లి బస్సు కోసం గంటల తరబడి ఎదురుచూపులకు స్వస్తి పలుకుదాం..! ఇంట్లో నుంచే స్మార్ట్ఫోన్ లో ‘గమ్యం’ యాప్ ద్వారా బస్సు ఎక్కడుందో తెలుసుకుందాం..! సమయానికి బస్టాండ్కు వెళ్లి బస్సు ఎక్కి ప్రశాంతంగా గమ్యం చేరుకుం దాం..! టీఎస్ఆర్టీసీ సాంకేతికతను అందిపుచ్చుకొని అత్యాధునిక ఫీచర్లతో బ స్ ట్రాకింగ్ యాప్(గమ్యం)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ స్థా నం, వెళ్లాల్సిన చోటు ఎంటర్ చేస్తే చాలు ఏ బస్సు ఎక్కడుంది..? ఎప్పుడు వస్తుం ది..? ప్రస్తుతం ఎక్కడ ఉన్నది..? వంటి వివరాలన్నీ క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. సమాచారానికి అనుగుణంగా సులభంగా ‘గమ్యం’ చేరుకోవచ్చు. పల్లెవెలుగు మినహా అన్ని బస్సులను ట్రాకింగ్ చేసే అవకాశం ఉన్నది. రాత్రివేళ మహిళా ప్రయాణికుల కోసం ‘ఫ్లాగ్ ఏ బస్’ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చా రు. యాప్లో వివరాలు నమోదు చేయగానే ఫోన్ స్రీన్పై వచ్చే గ్రీన్లైట్ను ఎదురుగా వచ్చే బస్డ్రైవర్ వైపు చూపిస్తే వాహనా న్ని నిలుపుతారు. ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతున్నదని ప్రయాణికులు చెబుతున్నారు.
కందనూలు, ఆగస్టు 28 : సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎప్పుడూ ముందుంటుంది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు సంస్థ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఈక్రమంలో అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్రాకింగ్ యాప్నకు ‘గమ్యం’గా నామకరణం చేసింది. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ‘గమ్యం’ యాప్ను గత శనివారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని సంస్థ స్వాగతిస్తూ రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు శ్రమిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను దగ్గర చేసేందుకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టింది.
యాప్ ప్రయోజనాలు..
అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు టీఎస్ ఆర్టీసీ బస్సుల సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. బస్సు ఎకడుందో? ఎప్పుడొస్తుందో? అని వేచి చూడాల్సిన అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్లు గల గమ్యం యాప్తో ఆర్టీసీ బస్సు మన వద్దకు రావడానికి ఎంత సమయం పడుతుందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో సూపర్ లగ్జరీ 42, ఎక్స్ప్రెస్ 92, డీలక్స్ 15, ప్రైవేట్ హైర్ ఎక్స్ప్రెస్లు 178 మొత్తం 328 బస్సులకు అధికారులు ట్రాకింగ్ సదుపాయం కల్పించారు. పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకూ ఈ ఏర్పాటు చేశారు. అక్టోబర్ నుంచి మిగతా సర్వీసులన్నింటికీ ట్రాకింగ్ను అనుసంధానం చేయనున్నారు. గమ్యం యాప్ ద్వారా ఆరంభ స్థానం నుంచి గమ్యస్థానం వరకు ఏఏ బస్సులు ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డ్రైవర్, కండక్టర్ వివరాలు అందులో కనిపిస్తాయి. రూట్ నంబర్ ఎంటర్ చేసి బస్సు ఎకడుందో పసిగట్టొచ్చు. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు. ఈ యాప్ ద్వారా సమీపంలోని బస్టాప్లను కూడా తెలుసుకోవచ్చు. ఆ సమాచారంతో జర్నీని ప్లాన్ చేసుకోవచ్చు.
ఫ్లాగ్ ఏ బస్ ..
మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తోన్న ఆర్టీసీ వారి సౌకర్యార్థం గమ్యం యాప్లో ‘ఫ్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాత్రి వేళల్లో బస్టాప్లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. రాత్రి 7 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ బస్ అందుబాటులో ఉంటుంది. యాప్లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్లో స్రీన్పై ఆటోమెటిక్గా గ్రీన్లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్ను డ్రైవర్ వైపునకు చూపించగానే సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ను సంప్రదించే సదుపాయం కూడా కల్పించారు. డయల్ 100, 108కి కూడా ఈ యాప్ను అనుసంధానం చేశారు. ఈ సదుపాయంతో యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చు. బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం, తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు.
‘గమ్యం’పై అవగాహన
అచ్చంపేట పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు గమ్యం యాప్పై కంట్రోలర్ వెంకటేశ్, స్టేషన్ మేనేజర్ బి. రాములు సోమవారం వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీ సీ ప్రయాణం సుగమం, సురక్షితం అని అన్నారు. గ మ్యం యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడంతో ఆర్టీసీ సేవలు అందులో నిక్షిప్తమవుతాయని చెప్పారు. బస్సుల టైమింగ్తోపాటు బస్సు ఎక్కడుందో లైవ్ లొకేషన్ను తెలుసుకోవచ్చన్నారు. సమయం వృథా కాకుండా బస్ ఏ టైంకు బస్టాండ్కు వస్తుందో ఇట్టే తెలుసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది, ప్రయాణికులున్నారు.