మహబూబ్నగర్ డిసెంబర్ 12: ఆర్టీసీ.. ఆదా యం సమకూర్చే పనిలో నిమగ్నమై ఉన్నది. అందివస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆర్టీసీకి ఇతర ఆదాయం సమకూర్చాలనే పట్టుదలతో పక్కా ప్రణాళిక అమలుచేస్తున్నారు. ఈ తరుణంలో ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న స్థలాలను పరిగణలోకి తీసుకొని ఆయా స్థలాల్లో పెట్రోల్బంక్లు, కల్యాణమండపాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, పెయిడ్ పార్కింగ్ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులకు స్పష్టమైన లిఖితపూర్వకంగా నివేదికలను అందజేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొమ్మిది పెట్రోల్బంక్లు, షాపింగ్కాంప్లెక్స్, కల్యాణమండపాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అధికారులు స్పష్టమైన నివేదికలను ఉన్నతాధికారులు అందించారు. ఈ విధానం మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఏర్పాట్లకు ప్రతిపాదనలు
ఆర్టీసీ అంటే నష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ముందుకు సాగుతున్న సంస్థ.. అంటు చాలామంది అంటుంటారు. ఈ నష్టాలను పూడ్చి లాభాల బాటలో ఆర్టీసీ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు నూతన ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న అదనపు స్థలాల్లో పెట్రోల్బంకులు, కల్యాణమండపాలతోపాటు షాపింగ్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులను నివేదికలను అందజేశారు.
ఉమ్మడి జిల్లాలో..
పాలమూరులోని పాత బస్టాండ్ వద్ద ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్, జడ్చర్ల నూతన బస్టాండ్ వద్ద పెట్రోల్బంక్, చైనా బజార్, సైకిల్స్టాండ్, బాదేపల్లి బస్టాండ్ వద్ద కల్యాణమండపం, దేవరకద్ర బస్టాండ్ వద్ద ఫంక్షన్హాల్తో కూడిన షాపింగ్కాంప్లెక్స్, నారాయణపేట జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద పెట్రోల్బంక్, కల్యాణమండపం, కోస్గి బస్టాండ్ వద్ద పెట్రోల్బంక్, వనపర్తి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్, ఫంక్షన్హాల్, పెబ్బేర్లో కల్యాణమండపం, అమరచింతలో కల్యాణమండపం, ఆత్మకూర్ వద్ద పెట్రోల్బంక్, మినీ ఫంక్షన్హాల్, షాబాద్లో పెట్రోల్బంక్, నాగర్కర్నూల్ డిపో వద్ద పెట్రోల్బంక్, ఫంక్షన్హాల్, బిజినపల్లిలో పెట్రోల్బంకు, తిమ్మాజిపేటలో పెట్రోల్బంకు, ఫంక్షన్హాల్, డిండి వద్ద కల్యాణమండపం, అమ్రాబాద్లో పెట్రోల్బంక్ను ఏర్పాటు చేసి ఆదాయం మరింతగా పెంచుకుంటూ ఆర్టీసీని లాభాల వైపు నడిపించేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
అదనపు ఆదాయంపై నజర్
ఆర్టీసీని ఎలాగైనా లాభాల వైపు తీసుకొచ్చేందుకు ముందు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రెండు, మూడు సంవత్సరాల నుంచి ఆర్టీసీకి ఉన్న విలువైన స్థలాల్లో లాభాలు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోగలిగితే మరింత అదనపు ఆదాయం వస్తుందని తెలంగాణ సర్కారు భావించిన విషయం విధితమే. ప్రభుత్వ సూచన మేరకు ఆర్టీసీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటూ ఆర్టీసీ స్థలాల్లో లాభాలు అర్జించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలోనే గడిచిన బుధవారం ఆర్టీసీ ఈడీ పురుషోత్తంనాయక్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్, కొత్తబస్టాండ్ పరిసర ప్రాంతాలతోపాటు జడ్చర్ల బస్టాండ్ పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు.
నివేదికలు అందజేశాం
ఆర్టీసీ స్థలాల్లో కాంప్లెక్సులు తదితర ఏర్పాట్లు చేయడం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని, ఉన్నతాధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుటుందని సలహాలు, సూచనలు తీసుకున్నాం. వారి సూచన మేరకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నాం. పెట్రోల్బంక్లు, షాపింగ్ కాంప్లెక్స్తోపాటు తదితర ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆవకాశం ఉంది.