ఉమ్మడి జిల్లాకు రెండు మెడికల్ కళాశాలలు
దళితబంధుకు భారీగా నిధులు
చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా
రూ.వెయ్యి కోట్లతో ఆయిల్పాం సాగుకు ప్రోత్సాహం
రూ. 75వేలలోపు వ్యవసాయ రుణాల మాఫీ
సొంత ఇంటి స్థలం ఉంటే రూ.3 లక్షలు చేయూత
మహబూబ్నగర్, మార్చి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం సం‘క్షేమ’ బడ్జెట్ ప్రవేశపెట్టింది. జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలో 3,500 ఎకరాల్లో ఆయిల్పాం సాగు అవుతుండగా.. రూ.వెయ్యి కోట్లను ప్రవేశపెట్టడంతో సాగు మరింతగా పెరగనున్నది. ఈ ఏడాది రూ.75 వేల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. సొంత జాగ ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా పథకాన్ని అమలు చేయనున్నది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ సంక్షేమానికి పెద్దపీట వేసింది. వెనకబడిన ప్రాంతాలైన జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం ఈ బడ్జెట్లో ముఖ్యాంశం. రెండు జిల్లాల్లోనూ వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకపై ఆధారపడుతారు. మెడికల్ కళాశాలల ఏర్పాటుతో స్థానికంగానే మెరుగైన వైద్యం అంది పొరుగు రాష్ర్టాలకు వెళ్లాల్సిన సమస్య తీరనున్నది. ఇక బడ్జెట్ లో దళితబంధుకు భారీగా నిధులు కేటాయించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రూ. వెయ్యి కోట్లను కేటాయించగా ఈసారి ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గానికి 100మంది చొప్పున ఇప్పటికే దళితబంధు అమలవుతున్నది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ తీసుకొచ్చిన మనఊరు- మనబడి పథకం ద్వారా అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన అందించడానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289 కోట్లు కేటాయించింది. మొదటి దశలో మండలానికి యూనిట్గా కార్యాచరణ ఉండనున్నది.
ఆయిల్పాం సాగుకు ప్రోత్సాహం
2022-23 సంవత్సరంలో బడ్జెట్లో ఆయిల్పాం సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 2.5లక్షల ఎకరాలలో ఆయిల్పాం సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకోసం ఈ బడ్జెట్లో రూ.1000కోట్లను కేటాయించింది. ఇప్పటికే జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో 3500ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతున్నది. నిధుల కేటాయింపు వల్ల సాగు మరింతగా పెరుగనున్నది. ఇక వ్యవసాయానికి ఎప్పటిలాగే భారీగా నిధులు కేటాయించారు. ఈ వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొత్తం రూ.24,254 కేటాయించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది రూ.75వేల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని సర్కారు నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధాప్య పింఛన్లకు..
వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు వయో పరిమితిని ప్రభుత్వం 65 నుంచి 57ఏండ్లకు తగ్గించింది. ఈ మేరకు ఇప్పటికే ఎంపిక చేసిన కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఆసరా ఫించన్లకు రూ.11,728కోట్లు కేటాయించింది.
నెరవేరనున్న సొంతింటి కల
సొంత జాగ ఉన్న వారు తమ స్థలంలోనే ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకు రూ.3లక్షలు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 40వేల మందికి సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికీ రూ.3లక్షల చొప్పున ప్రభుత్వం ఇవ్వనున్నది.
గొల్ల కురుమల సంక్షేమానికి..
గొల్ల కురుమల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. రూ.11,000కోట్లతో 7.3లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 71వేల మందికి రూ.1300కోట్ల వరకు ఖర్చు చేసి గొర్రెల పంపిణీ చేసేందుకు నిధులు కేటాయించనున్నారు.
కొత్తగా నేతన్నకు బీమా
రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5లక్షల బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. ఇక దళితబంధు తరహాలోనే నేతన్నలను ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నది. వీటి వల్ల ఉమ్మడి జిల్లాలోని 10వేల మందికి పైగా నేత కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది.
గీత కార్మికుల సంక్షేమానికి..
గీత కార్మికుల సంక్షేమానికి రూ.100 కోట్లతో ప్రత్యేక పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గౌడ కులస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
భవననిర్మాణ కార్మికులకు..
భవననిర్మాణ కార్మికుల కోసం మొదటి విడుతలో ఉమ్మడి జిల్లాలో సుమారు 8వేల మందికి మోటారు సైకిళ్లను ఇవ్వనున్నారు. దీనివల్ల వారి ఉపాధి కోసం ప్రయాణించేందుకు వీలవుతుంది.
గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు..
గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఈ ఏడాది రూ.600కోట్లను కేటాయించగా.. ఉమ్మడి జిల్లాలోని 273తండాలకు ప్రయోజనం కలుగనున్నది. వీటితోపాటు రాష్ట్ర బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. విద్య, వైద్యరంగాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించారు.
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం
తెలంగాణ ప్రభుత్వంలో గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో అభివృద్ధి పథంలో పరుగులు పెడుతు న్నాయి. అద్దె భవనంలో గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహించే వాళ్లం. బడ్జెట్లో సీఎం కేసీఆర్ గిరిజన తండాల్లో గ్రామ పంచాయతీల సొంత భవనాలకు నిధులు కేటాయించడం సంతో షంగా ఉంది. మా తండాలో గ్రామ పంచాయతీ భవనం నిర్మించుకునే అవకాశం కలుగడం సంతోషంగా ఉంది. తండాలో మౌలిక వసతులు కల్పించిన సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు. గిరిజనులమంతా సార్కు రుణపడి ఉంటాం.
– గోపినాయక్, సర్పంచ్, వాయిల్కుంటతండా, బాలానగర్
ఆత్మ గౌరవంతో బతుకుతున్నాం
గత ప్రభుత్వాలు గౌడ కులస్తుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. స్వరాష్ట్రంలో ఆత్మ గౌరవంతో బతుకుతున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.100కోట్లు కేటాయించడం హర్షణీయం. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– రాఘవేందర్గౌడ్, గౌడసంఘం నాయకుడు, ఊట్కూర్
దళితుల అభ్యున్నతికే..
సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించటం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో వచ్చే ఏడాదికల్లా 2లక్షల మందికి దళితబంధు కింద రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం అందనుంది. ఆర్థికంగా వెనుకబడిన దళితులు లక్షాధికారులు అయ్యే అవకాశాలున్నాయి. ప్రపంచంలోనే మొదటిసారిగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దళితబంధు పథకం ప్రవేశపెట్టారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. గత ప్రభుత్వాలు దళితులను ఓటుబ్యాంకుగానే వాడుకున్నారు. సీఎం కేసీఆర్ ఒక్కరే దళితుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారు. దళితబంధు పథకంతో లబ్ధిపొందిన వారు జీవితంలో కేసీఆర్ను మరిచిపోరు. సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
– జంగయ్య, రైతుబంధు మండలాధ్యక్షుడు, జడ్చర్ల