అచ్చంపేట, ఫిబ్రవరి 23 : ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టమని, వందరోజుల పాలన పూర్తయిన తరువాత ప్రజా సమస్యలపై పోరాడుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. శుక్రవారం అచ్చంపేటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గువ్వల మాట్లాడారు. ఈనెల 25న అచ్చంపేటలోని కొండనాగుల రోడ్డులో గల బీకే ప్యాలెస్లో ఉదయం 10గంటలకు నిర్వహించే కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హాజరవుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 8 మండలాలు, అచ్చంపేట మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ముఖ్యనేతలు తరలిరావాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చారని, వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు. దుందుభీవాగులో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యాలు, భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, ఉడుత బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు వ్యక్తిగత విమర్శలు మాని పరిపాలనపై దృష్టిసారించాలన్నారు. అబద్ధాన్ని పదేపదే చెప్పినంత మాత్రాన ప్రజలెవరూ నమ్మరన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులు పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. అలాగే తాగునీరు, కరెంటు కోతలతో ప్రజలు సతమతమవుతుండగా, పంటలు ఎండి రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆవేదన చెందుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్కు ఎందుకు ఓటేశామా అని ప్రజలు ఆలోచనలో పడ్డారన్నారు. ఆరు గ్యారెంటీలు కాదు 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 25న నిర్వహించే సమావేశానికి బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కౌన్సిలర్లు రమేశ్రావు, మన్నుపటేల్, సోమ్లానాయక్, గడ్డం రమేశ్, సింగిల్విండో చైర్మన్ నర్సయ్యయాదవ్, జెడ్పీటీసీ రాంబాబు, మాజీ సర్పంచ్ లోక్యానాయక్, మైనారిటీ నాయకులు అమీనొద్దీన్, కుత్బుద్దీన్, సుంకరి బాలరాజు, గోపాల్నాయక్, చెన్నకేశవులు, చుక్కారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, మోతీలాల్, శ్రీను, పర్వతాలు, ఉస్సేన్, పెంటయ్య, లింగం, తిరుపతయ్య, వెంకటయ్య, రాజు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.