నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణం పదో వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో రైస్ కుక్కర్ పేలి ( Rice Cooker Explode ) చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైస్ కుక్కర్లో వండిన తరువాత ఆయా దానిని చిన్నారుల ఎదుటే తీయడంతో ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడే ఉన్న చిన్నారులు గాయపడ్డారు.

వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సూపరింటెండెంట్ శ్రీనివాస్, చిన్నపిల్లల డాక్టర్ యాదగిరి బిల్లా గాయపడ్డ చిన్నారులకు వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న సీడీపీవో మహేశ్వరి అక్కడికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం వహించిన ఆయాపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు.