అయిజ, జూన్ 26 : ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరం వరకు ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీ సుకున్నది. ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశారు. ఇప్పటికే రూ. 783 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టి సాగునీరు అందిస్తున్నారు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వలో పూడికతీతతోపాటు మరమ్మతులు, కాల్వ పటిష్టత, కాల్వ గట్లపై ముళ్ల పొదల తొలగింపు పనులకు ప్రభుత్వం రూ.13 కోట్లు విడుదల చేసింది. దీంతో అధికారులు టెండర్లు పి లువగా, రూ. 11.30 కోట్లకు కాంట్రాక్టర్ పనులు దక్కించుకొని పనులు చేపట్టాడు.
ఆర్డీఎస్ ప్రధానకాల్వ 68.440 కిలోమీటర్ నుంచి 142.800 కిలోమీటర్ వరకు పూడికతీత, కాల్వ మరమ్మతులు, ముళ్ల పొదల తొలగింపు, కాల్వ పటిష్టత పనులు చేస్తున్నారు. అలాగే 29,30,38,38ఏ, 39, 40 డిస్ట్రిబ్యూటరీలకు మరమ్మతులు చేపట్టా రు. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు నీటిని విడుదల చేసేవరకు పనులు పూర్తి చేయాలనే లక్ష్యం తో పనుల్లో వేగం పెంచారు. ఒక వైపు అధికారులు సర్వే చేస్తుండగా, మరో వైపు పూడికతీత, ముళ్ల పొదల తొలగింపు, కాల్వ పటిష్టం పనులు చేస్తున్నారు. ఆర్డీఎస్ ప్రధానకాల్వల మరమ్మతులు పూర్తి చేసి ఈ ఏడాది చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీఎస్ ఈఈ విజయ్కుమార్రెడ్డి తెలిపారు.