మూసాపేట(అడ్డాకుల), మార్చి 22 : ఆది దంపతులు శివపార్వతుల వివాహ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దక్షిణకాశి అయిన కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా శుక్రవారం శివపార్వతుల వివాహ వేడుకను భక్తులు కనులారా వీక్షించి పులకించిపోయారు. మాజీ సర్పంచ్ నాగిరెడ్డి ఇంటి నుంచి పట్టువస్ర్తాలు, పసుపు బియ్యాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి సతీమణి తీసుకొచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై శివపార్వతులను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు. అనంతరం అర్చకులు శివపార్వతులు కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.