మూసాపేట(అడ్డాకుల), మార్చి 21 : దక్షణకాశీగా పేరుగాంచిన కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూతబలి, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం, దీక్షాధారణ, అఖండస్థాపన, త్రిశూలపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, బలిహరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శుక్రవారం ఉదయం 10గంటలకు పార్వతీ, రామలింగేశ్వరస్వామి కల్యాణం ఉంటుందని, కల్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులకు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈవో రాజేశ్వరశర్మ, గ్రామ పెద్దలు కోరారు.
రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేసినట్లు ఆలయ ఈవో రాజేశ్వరశర్మ తె లిపారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు క్యూ లో నిలిచి ఉండడానికి నీడ, తాగునీటి వసతి తదితర ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.