కడ్తాల్, డిసెంబర్ 27 : ప్రతి మనిషి భయం లేకుండా బుద్ధుడివలే జీవించాలని పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ అన్నారు. మండలంలోని అన్మాస్పల్లి సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్లో, పిరమిడ్ స్పిరిచ్వల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగాలు ఏడో రోజుకి చేరుకున్నాయి. బుధవారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు నిర్వహించిన, ప్రాతఃకాల ధ్యానంలో ధ్యానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్ధేశించి పరిమళ పత్రీ మాట్లాడుతూ సత్యం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నవాళ్లే పిరమిడ్లోకి వస్తారని తెలిపారు.
ప్రముఖ హిందూ ధర్మం ప్రచారకులు రాధామనోహర్ మాట్లాడుతూ ప్రతి మనిషి సకల ప్రాణకోటి కోసం, వాటి స్వేచ్ఛ కోసం పాటుపడాలని తెలిపారు. శ్వాస మీద ధ్యాసతో శక్తి లభిస్తుందని పేర్కొన్నారు. మనల్ని మనం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అని వివరించారు. ధ్యాన మహాయాగంలో ప్రతి రోజూ నిర్వహిస్తున్న కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ధ్యానులను అలరిస్తున్నాయి. కార్యక్రమంలో సీజీఆర్ వ్యవస్థాపకురాలు లీలాలక్ష్మారెడ్డి, పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు బాలకృష్ణ, సాంబశివరావు, హనుమంతురాజు, రాంబాబు, శ్రీరామ్గోపాల్, శివప్రసాద్, దామోదర్రెడ్డి, మాధవి, లక్ష్మీ, నవకాంత్, ధ్యానులు తదితరులు పాల్గొన్నారు.