జడ్చర్ల టౌన్, నవంబర్ 2 : ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందించి అండగా నిలిచారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 5, 19వ వార్డుల్లో గురువారం జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు తిలకం పెట్టి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి హారతులు పట్టారు. ఇంటింటికీ తిరుగుతూ ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తాగునీరు, కరెంటు సక్రమంగా అందుతుందా.. రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, ఆడబిడ్డలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం కొనసాగించారు.
వచ్చే ఐదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను గురించి వివరిస్తూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన సంక్షేమ పథకాలన్నీ ప్రతి కుటుంబానికి అందిస్తామన్నారు. నవంబర్30వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పలుచోట్ల మహిళలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి బొడ్డెమ్మ ఆడారు. కారు గుర్తుకు మా ఓటు అంటూ ప్రజలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కౌన్సిలర్లు నవనీతకొండల్, సాజిదా ఇఫ్తెకారొద్దీన్, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, వైస్ చైర్మన్ దానిష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళి, మాజీ సర్పంచ్ రేణుక, ముడా డైరక్టర్ రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు