అయిజ, మే 9 : మక్కల బస్తాల తరలింపులో జాప్యం జరుగుతుండటంతో కడుపు మండిన కర్షకులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. శనివారం అయిజ పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్లో మక్కల రైతులు అయిజ-గద్వాల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంటా వేసిన మక్కల బస్తాలను నెలరోజులైనా గోదాంలకు తరలించకుండా సర్కారు కాలయాపన చేస్తుందని విమర్శించారు. పంటలకు మద్దతు కల్పిస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వం ధాన్యం తరలింపులో చిత్తశుద్ధి కనిపించడంలేదని ఆరోపించారు. మక్కల బస్తాలు గోదాంలకు తరలించకపోవడంతో రోజుల తరబడి రేయింబవళ్లు కాపలాకాయాల్సి వస్తుందన్నారు. మార్కెట్లో పందులు, పాముల బెడదతో నిద్రహారాలు మానుకోవాల్సి వస్తుందని మండిపడ్డారు. అధికారులు వస్తున్నారూ.. పోతున్నారూ.. కాని లారీలు రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం తరలించలేని అసమర్థ సర్కారు : పల్లయ్య
మొక్కజొన్న ధాన్యాన్ని గోదాంలకు తరలించేలేని అసమర్థ సర్కారు రాష్ట్రంలో ఉందని బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు కుర్వ పల్లయ్య మండిపడ్డారు. నెలరోజులుగా మార్కెట్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నా సర్కారు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మార్కెట్లోని రైతులకు కనీస వసతులు కల్పించడంలోనూ సర్కారు విఫలమైందన్నారు. రైతులను కష్టపెడుతున్న రేవంత్రెడ్డి సర్కారును రైతులే కూల్చేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సర్కారు, జిల్లా అధికారులు తక్షణమే మక్కల బస్తాలను గోదాంలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. బైఠాయించిన రైతులకు ఎస్సై మల్లేశ్ నచ్చచెప్పి నిరసనను విరమింపజేశారు. గంటపాటు రోడ్డుపై రైతులు నిరసనకు దిగడంతో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. కార్యక్రమంలో రైతులు వీరేశ్, రాముడు, మద్దిలేటి, హన్మంతు, గోవిందు, శేషన్న పాల్గొన్నారు.