నాగర్కర్నూల్, జనవరి 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఆకాంక్ష తీరనున్నది. 2015లో పదోన్నతులు ఇవ్వగా, 2018లో బదిలీలు జరిగాక మరోసారి పదోన్నతులు, బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అలాగే స్పౌజ్ కేటగిరీలోని ఉపాధ్యాయ దంపతులనూ ఒకే ప్రాంతానికి చేర్చేలా బదిలీకి సైతం అవకాశం కల్పించనుండటం విశేషం. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం శని, ఆది, సోమవారాల్లో మూడు రోజులపాటు బదిలీలకు ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను విద్యా శాఖ ఇప్పటికే విడుదల చేసింది. చాలామంది ఉపాధ్యాయులు తమకు అనువుగా ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. బదిలీల కోసం విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. పదోన్నతుల కోసం అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాలు ఆయా జిల్లాల విద్యాశాఖ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. ముందుగా ఫిబ్రవరి 14వరకు హెచ్ఎంలను బదిలీ చేస్తారు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న హెచ్ఎంల స్థానాల్లో అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు 22, 23వ తేదీల్లో హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పిస్తారు. అనంతరం అర్హులైన ఎస్జీటీ ఉపాధ్యాయులకు మార్చి 25, 27వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించడం జరుగుతుంది.
మార్చి 4వ తేదీన ఎస్జీటీ ఉపాధ్యాయ బదిలీలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయ దంపతుల బదిలీలకు సైతం ప్రభుత్వం అవకాశం కల్పించనుండటం గమనార్హం. అయితే గతంలో ఎనిమిదేండ్ల్లలోపు స్పౌజ్ వినియోగించుకుంటే మళ్లీ అవకాశం ఉండదు. ఈ క్రమంలో అలాంటి ఉపాధ్యాయులంతా బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించనున్నారు. కాగా, విద్యార్థుల సంఖ్యలేని పాఠశాలల్లో ఖాళీలను విద్యాశాఖ వెల్లడించనుండటం లేదు. ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను పరిశీలించడం జరిగింది. సర్వీసులో జాయిన్ అయిన వివరాలు, కుల, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బదిలీలకు సంబంధించి నిబంధనలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది.
2023, ఫిబ్రవరి 1నాటికి పాఠశాలలో రెండేండ్ల సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులు బదిలీలకు అర్హులవుతారు. దీని ప్రకారంగా ఉపాధ్యాయులంతా బదిలీలకు అర్హత సాధించడం జరుగుతుంది. అలా ఒక పాఠశాలలో ఐదేండ్లు పూర్తిచేసిన హెచ్ఎంలు, ఎనిమిదేండ్లు పూర్తిచేసిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. 50ఏండ్లలోపు వయసున్న బాలికల పాఠశాలల్లోని ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. స్పౌజ్, అవివాహిత మహిళలకు 10అదనపు పాయింట్లు, ఎనిమిదేండ్లకోసారి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఓడీ ఉన్న సంఘాలు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులకు 10అదనపు పాయింట్లు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాడుకునే ఉపాధ్యాయులు జనవరి 1వ తేదీ తర్వాత మెడికల్ బోర్డు జారీచేసిన సర్టిఫికెట్లు జతచేయాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపుగా 16వేల మంది ఉపాధ్యాయులు బదిలీలతో సంతోషపడుతున్నారు. విద్యాశాఖ అధికారుల అంచనా ప్రకారం ఉమ్మడి పాలమూరులో 216జీహెచ్ఎంల ఖాళీలు ఉండగా, 1200మంది ఉపాధ్యాయులు పదోన్నతులకు అవకాశం పొందనున్నారు. ఇందులో నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా ఉన్నట్లుగా సమాచారం.
ప్రభుత్వ ఆదేశాలతో శనివారం నుంచి 30వ తేదీవరకు ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇప్పటికే పదోన్నతుల సీనియార్టి పూర్తయినది. జిల్లాలో 825పాఠశాలల్లో 3వేలమందికిపైగా ఉపాధ్యాయులు ఉన్నారు. 26మంది ఉపాద్యాయ దంపతులు బదిలీలకు దరఖాస్తులు చేసుకున్నారు. పదోన్నతికి అర్హులైన 141మంది స్కూల్ అసిస్టెంట్ల సర్వీసు రికార్డులు, సర్టిఫికెట్లన్నీ పరిశీలించాం. కలెక్టర్ ఆధ్వర్యంలో పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా ఆన్లైన్లో చేపట్టడం జరుగుతుంది.
– గోవిందరాజులు, డీఈవో, నాగర్కర్నూల్ జిల్లా