మరికల్ : తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల ( Electricity Employees ) సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1104) రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా( Saibaba) డిమాండ్ చేశారు. మరికల్ ( Marikal ) మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన యూనియన్ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హార్టిజన్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా అన్ని అర్హతలు కల్పించాలని డిమాండ్ చేశారు.
2017 నుంచి హార్టిజన్ ఉద్యోగులకు రావలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని,క్షేత్రస్థాయిలో కిందిస్థాయి ఉద్యోగుల నియామకాలను చేపట్టాలని, కారుణ్య నియామకాలను వెంటనే నియమించాలని పేర్కొన్నారు. అనారోగ్యం బారిన ఉన్న ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేసి పదవి విరమణ పొందే విధంగా అవకాశం కల్పించాలన్నారు.
హార్టిజన్ ఉద్యోగులకు ఈపీఎస్ జీపీఎస్ వర్తింపచేయాలన్నారు.అంతకుముందు మరికల్ మండల కేంద్రంలో యూనియన్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు, డివిజన్ కార్యదర్శి మొగులప్ప, రఘు, రవీంద్ర చారి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ గౌడ్, ఆనంద్ కుమార్, శ్రీధర్, స్థానిక ఉద్యోగులు పాల్గొన్నారు.