ఖిల్లా ఘనపూర్: వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం గణపసముద్రం రిజర్వాయర్ (Ganapasamudram ) నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసిత రైతు కుటుంబాలకు (Displaced Farmers) ప్రభుత్వం ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలని ముంపు రైతులు డిమాండ్ చేశారు.
రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూములను సేకరించడంతో అనేక రైతు కుటుంబాలు తమ జీవనాధారాన్ని కోల్పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసిత కుటుంబాల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా తదితర అర్హతలు కలిగిన చదువుకున్న మహిళలు, పురుషులు ఎంతోమంది ఉన్నారని, వారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల నోటిఫికేషన్లో విద్యార్హతలు, స్థానికత, మెరిట్ వంటి నిబంధనలను యథాతథంగా అమలు చేస్తూనే, ముందుగా అర్హత కలిగిన రిజర్వాయర్ నిర్వాసిత రైతు కుటుంబాల అభ్యర్థులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే సానుకూలంగా పరిశీలించి నిర్వాసిత రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.