అమరచింత, ఏప్రిల్ 4 : అమరచింత పురపాలక చైర్పర్సన్ మంగమ్మ, వైస్చైర్మన్ గోపిపై ఆరుగురు కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రిసైడింగ్ అధికారి పద్మావతి వెల్లడించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీకి కేటాయించిన నిధులను చైర్పర్సన్, వైస్ చైర్మన్ పురపాలక అధికారులతో కుమ్మక్కై దండుకున్నారని, వారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని గత నెల 16వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజశేఖర్రెడ్డి, సింధు, బీజేపీకి చెందిన లావణ్య, ఊషారాణి, సీపీఐకి చెందిన విజయరాములు, సీపీఎంకి చెందిన మాధవి రాతపూర్వకంగా కలెక్టర్కు లేఖ అందజేశారు. కాగా ఏప్రిల్ 4న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు గత నెల 18న చైర్పర్సన్తోపాటు వైస్చైర్మన్, కౌన్సిలర్లకు నోటీసులు అందించామన్నారు.
ఈక్రమం లో గురువారం 11 గంటలకు భారీ బందోబస్తు మధ్య మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మంగమ్మపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు రాజశేఖర్రెడ్డి, సింధు, సీపీఐ పార్టీకి చెందిన విజయరాములు, బీజేపీకి చెందిన లావణ్య మాత్రమే హాజరు కావడంతో అసంతృప్త కౌన్సిలర్లకు అరగంట సమయం ఇస్త్తూ మళ్లీ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఎవ రూ రాలేదు. అదేవిధంగా వైస్చైర్మన్ గోపిపై పెట్టిన అవిశ్వానికి సైతం నలుగురు మాత్రమే హాజరు కావడంతో.. చైర్పర్సన్, వైస్చైర్మన్పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయిందని ఇప్పుడున్న పాలకవర్గమే కొనసాగుతుందని ప్రిసైడింగ్ అధికారి వెల్లడించారు.