తలాపున కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా.. గొంతు తడవని పరిస్థితి నాటిది.. సమైక్య పాలకుల పక్షపాత ధోరణితో తాగు నీటికి ప్రజలు నానా పాట్లు పడ్డారు. బిందెడు నీటి కోసం కి.మీ. మేర ప్రయాణం.. సైకిళ్లకు వాటర్ క్యాన్లు కట్టుకొని రాత్రిళ్లు జాగారం.. ట్యాంకర్ల వద్ద, పబ్లిక్ నల్లాల వద్ద సిగపట్లు.. ఇది గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. మారుమూల పల్లెలకు నల్లా కనెక్షన్లు రావడంతో పానీపట్టు యుద్ధాలకు చెక్ పడింది. తెలంగాణ ఏర్పడ్డాక తాగునీటికి ఆడపడుచులు బిందెలతో రోడ్డెక్కొద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. దీంతో పల్లెలను శుద్ధ జలాలు ముద్దాడాయి. ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నది. అయితే వనపర్తి జిల్లాకు పక్క జిల్లాల్లోని శుద్ధి ప్లాంట్ల నుంచి నీరు సరఫరా అవుతున్నది. కాగా, భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి జిల్లాలోనే రూ.430 కోట్లతో ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో రూ.300 కోట్లతో పనులు జరగగా.. అదనంగా రూ.130 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. బుగ్గపల్లి తండా నుంచి త్వరలో 378 గ్రామాలు, ఐదు బల్దియాలు.. 20 మండలాలకు నిరంతరం తాగునీరు సరఫరా కానుండగా.. 29న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించగా.. జిల్లావాసులు సంబురపడుతున్నారు.
– మహబూబ్నగర్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేరుకే సప్త సముద్రాలు.. చుక్కా నీరు లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న వనపర్తి ప్రాంతానికి సాగునీరు అందించాలన్న ధ్యాస నాటి పాలకులు చేయలేదు. చెంతనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా బీడు భూముల్లో పారించాలన్న తపన కరువైంది. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రి నిరంజన్రెడ్డి జిల్లా దశదిశనే మార్చేశారు. ఎవరూ ఊహించని అద్భుతాలను సృష్టించి కృష్ణా జలాలను బీడు భూముల్లో పారించి నీళ్ల నిరంజన్రెడ్డిగా చరిత్రలో నిలిచిపోయారు. ఏకంగా 101 చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలకు అంకురార్పణ చేసి సస్యశ్యామలం చేశారు. వనపర్తిని జిల్లా కేంద్రంగా మార్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుండగా.. తాజాగా జిల్లాలో తాగునీటికి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా పరిష్కారం చూపారు.
భవిష్యత్ తరాలకు సాగునీటి, తాగునీటికి ఢోకా లేకుండా చర్యలు చేపట్టారు. రూ.430 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం శరవేగంగా పూర్తయ్యింది. ఇందులో రూ.300 కోట్లతో పనులు చేపట్టగా.. అదనంగా రూ.130 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. దీంతో 378 గ్రామాలకు, ఐదు మున్సిపాలిటీలకు, 20 మండలాలతోపాటు నాలుగు నియోజకవర్గాలకు తాగునీటి అవసరాలు తీర్చేలా దీన్ని రూపొందించారు. కొల్లాపూర్ శివారులోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సుమారు 1.378 టీఎంసీల నీటిని ఏడాది పొడవునా అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పెద్దమందడి మండ లం బుగ్గపల్లి తండా వద్ద పూర్తి చేసుకున్న ఈ పథకాన్ని 29న మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్చే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
శరవేగంగా పనులు
తెలంగాణ ఏర్పడ్డాక తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం విజయవంతం కావడంతో గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి ఎద్దడే లేకుండా పోయింది. దీంతో వనపర్తి జిల్లాకు ప్రత్యేకంగా పథకాన్ని తీసుకువచ్చి జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చేయాలనే సంకల్పంతో మంత్రి నిరంజన్రెడ్డి మంజూరు చేయించారు. సుమారు రూ.3 వందల కోట్లతో చేపట్టిన ఈ పథకాన్ని మెఘా ఇంజినీరింగ్ కంపెనీ రూ.243.34 కోట్లకు దక్కించుకున్నది. జూలై 4న అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించగా.. కాగా కరోనా కారణంగాతో ఏడాది పాటు పనులు నిలిచిపోయాయి. తర్వాత పనులను శరవేగంగా చేపట్టి కేవలం రెండేండ్లలోనే పూర్తి చేశారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సు మారు 1.378 టీఎంసీల నీటిని వాడుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. గౌరిదేవిపల్లి రిజర్వాయర్ వద్ద 21,625 కిలోలీటర్ల కెపాసిటీ ఉన్న సంప్లను నిర్మించారు. ఈపథకంతో 5,72,702 జనాభాకు ప్రతిరోజు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. 4,37,732 రూరల్ జనాభాకు, 1,34,970 అర్బన్ జనాభాకు తాగునీటిని అం దిస్తారు. మొత్తం నాలు గు నియెజకవర్గాల్లోని 20 మండలాల కు, ఐదు మున్సిపాలిటీలకు 378 గ్రా మాలకు తాగునీటి అవసరాలు తీర్చే వి ధంగా రూపొందించారు. మంత్రి నిరంజన్రెడ్డి దగ్గరుండి పనులు చేయించడంతో జిల్లాకు తాగునీటి అవసరాలు తీర్చే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.
భవిష్యత్లో ఇబ్బంది ఉండొద్దనే..
భగీరథ పథకంతో వనపర్తి జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చేసేందుకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపి రూ.243.34 కోట్లతో ప్రత్యేక మిషన్ భగీరథ పథకాన్ని సాధించారు. సీఎం కేసీఆర్కు ఈపథకం ఉద్దేశం వివరించి మంజూరు చేసుకుని వచ్చారు. జిల్లాలో భవిష్యత్లో తాగునీటికి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. ప్రత్యేక చొరవ చూపించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. జిల్లాకేంద్రానికి సమీపంలోని పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండా వద్ద ఈ పథకానికి అంకురార్పణ చేశారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు రిజర్వాయర్ నుంచి గౌరిదేవిపల్లి రిజర్వాయర్కు అక్కడి నుంచి వనపర్తి జిల్లాకు తాగునీటికోసం 46.85 కిలోమీటర్ల ప్రత్యేక పైప్లైన్ వేశారు. బుగ్గపల్లి తండా హెడ్వర్క్స్ వద్ద 75 మిలియన్ లీటర్ల కెపాసిటీ ఉన్న రెండు భారీ సంప్లు, 10 మిలియన్ లీటర్ల కెపాసిటీ ఉన్న మరో సంప్ను గోపాల్పేట వద్ద నిర్మించారు. గుంపుగట్టు, రేవల్లితో పాటు బుగ్గపల్లి తండా వద్ద ఓవర్హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే అన్ని గ్రామాలకు తాగునీరు అందనున్నది.
29న మంత్రి కేటీఆర్చే ప్రారంభం
వనపర్తి జిల్లాకు తాగునీటి కోసం రూపొందించిన భగీరథ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈమేరకు మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తున్నారు. అలాగే రూ. 666 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి కేటీఆర్ శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం కొత్తకోటలో భారీ బహిరంగ నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా వనపర్తి నియోజకవకర్గ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంతో విపక్షాలు ఖంగుతింటున్నాయి.
వందేండ్ల కరువును పారదోలేందుకు..
తెలంగాణ వస్తదని ఎవరూ ఊహించలేదు.. ఉద్యమ నాయకులు కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో రాష్ర్టానికి జరుగుతున్న అన్యా యాన్ని ప్రశ్నించి ప్రజలను చైతన్యవంతులను చేసి సాధించారు. తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమపాళ్లల్లో చేసి చూపించారు. ఎవరు అడగని, ఎవరు కలగనని పథకాలకు రూపకల్పన చేసి ప్రజల జీవన ప్రమాణాలను పెంచారు. ఇది మన సర్కారు అనేలా మోడల్గా మార్చారు. వనపర్తి జిల్లాలో వందేండ్ల వరకు కరువు రాకుండా.. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేసేందుకు సాగు, తాగునీటికి ఢోకా లేకుండా చేస్తున్నాం. మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తా.
– నిరంజన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి