పరిగి, నవంబర్ 30 : పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గురువారం ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల తర్వాత సైతం కొన్ని పోలింగ్ కేంద్రాలలో కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు పరిగి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో 69.34శాతం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా ముందుగా మందకొడిగానే పోలింగ్ జరిగింది. మొదటి రెండు గంటలైన 9 గంటల వరకు 8శాతం ఓటింగ్ జరుగగా, ఉదయం 11 గంటల వరకు 22.99శాతం ఓటింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 46.19శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 58.65శాతం ఓటింగ్, సాయంత్రం 5 గంటల వరకు 69.34శాతం ఓటింగ్ జరిగింది. పరిగి పట్టణంతోపాటు పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో బారులు తీరి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటుహక్కు వచ్చిన తర్వాత మొదటిసారి అనేక మంది యువతీ యువకులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పరిగి నియోజకవర్గంలో పోలింగ్ను రిటర్నింగ్ అధికారి ఎ.విజయకుమారి పర్యవేక్షించారు.
ఈ మేరకు రిటర్నింగ్ అధికారి పరిగి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు. సాధారణ పరిశీలకులు సుధాకర్ పరిగి మండలం నస్కల్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ను పరిశీలించారు. పరిగి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. నియోజకవర్గంలో డీఎస్పీ విజయకుమార్ నేతృత్వంలో పోలింగ్కు విస్తృత మైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గురువారం జరిగిన పోలింగ్లో భాగంగా పరిగి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని 216 పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి-ప్రతిమారెడ్డి దంపతులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి సతీమణి గిరిజ, కుమారుడు అనిల్రెడ్డి, కోడలు శ్రీదీప్తిలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే మండలంలోని రంగాపూర్లో ఎంపీపీ కరణం అరవిందరావు కుటుంబసభ్యులతో కలిసి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పరిగి పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
గండీడ్: మండలంలో 37 పోలింగ్ బూతుల్లో అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. వెన్నాచేడ్, పెద్దవార్వల్, రుసుంపల్లి, గండీడ్, కొంరెడ్డిపల్లి, రెడ్డిపల్లి, ఆశిరెడ్డిపల్లి, సల్కర్పేట్, రంగారెడ్డిపల్లి, జానంపల్లి, తదితర గ్రామాల్లో ప్రజలు ఉదయం నుంచి ఓటు వేయడానికి పొలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. బల్సుర్గొండ గ్రామంలో ఈవీంలు అరగంట పాటు మొరాయించడంతో ఓటర్లు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాలార్నగర్ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకుంది.
మహ్మదాబాద్: . మండంలోని 32 పోలింగ్ బూత్లలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మొకర్ల బాద్, నంచర్ల, చౌదర్పల్లి తదితర గ్రామాల్లో ఒకటి,రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. నంచర్లలో ఈవీఎంలు నెమ్మదిగా పనిచేయడంతో రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉండి ఓటు హక్కును వినియోగించుకున్నా రు. అన్ని గ్రామాల్లో సుమారు 75 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
దోమ: మండల వ్యాప్తంగా 78 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు మండల మానిటరింగ్ టీమ్ లీడర్ జయరాం తెలిపారు. పాలేపల్లి,మైలారం గ్రామాలలో ఈవీఎంలు మొరాయించడంతో 40 నిమిషాల అనంతరం పోలింగ్ ప్రారంభమైంది. మండల జడ్పీటీసీ నాగిరెడ్డి అయినాపూర్ పోలింగ్ బూత్ను పరిశీలించారు. దాదాపూర్ పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లు తోపులాటకు పాల్పడగా ఇరు వర్గాల నాయకులు వాగ్వాదానికి దిగారు అది గమనించిన పోలీసులు ఇరు వర్గాల నాయకులను ఓటర్లను సముదాయించడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
కులకచర్ల: కులకచర్ల మండలంలో సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ పూర్తికాని గ్రామాలు ముజాహిద్పూర్, పుట్టపహాడ్, బొంరెడ్డిపల్లి గ్రామాలు ఉండగా చౌడాపూర్ మండలంలో వీరాపూర్, లింగంపల్లి, కొత్తపల్లి గ్రామాల్లోనూ ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కాగా ముజాహిద్పూర్ పుట్టపహాడ్ గ్రామాల్లో ఓటింగ్ను త్వరగా పూర్తి చేసినా మిగితా గ్రామాల్లో ఓటింగ్ రాత్రి 7తరువాత కూడా కొనసాగింది.
కొడంగల్ నవంబర్ 30 : కొడంగల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. గత 2018 ఎన్నికల్లో ఉదయం 10 గంటలు దాటే వరకు కూడా పోలింగ్ మందకొడిగా సాగింది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటింగ్ వేసేందుకు తరలి రావడంతో కేంద్రాల్లో జన జాతర సాగింది. పోలింగ్ ప్రక్రియ నిర్వాహణకు ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. వృద్ధులకు ప్రత్యేకమైన వీల్చైర్లు ఏర్పాటు చేసి సిబ్బంది సహాయంతో ఓటింగ్ వేయించారు. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాలతో పాటు మద్దూర్, కోస్గి మండలాల్లో ఉత్సహంగా పోలింగ్ సరళి కొనసాగింది. బొంరాస్పేట మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో వీవీ ప్యాట్ మిషన్ మొరాయిండంతో పోలింగ్కు గంట పాటు అంతరాయం ఏర్పడింది.
దాంతో ఓటర్లు కొంత వరకు ఇబ్బందికి గురయ్యారు. నియోజకవర్గంలోని ఒకటి, రెండు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద చెదురుమదురు సంఘటనలు తలెత్తినప్పటికీ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోకవర్గంలోని కోస్గి మండలం మీర్జాపూర్లోని ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో సతీమణి శృతి, కుమారుడు హితీష్రెడ్డితో పాటు కూతురుతో కలిసి ఎమ్మెల్యే ఓటు వేశారు.బొంరాస్పేట: గురువారం జరిగిన పోలింగ్ బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో ప్రశాంతంగా ముగిసింది. తుంకిమెట్ల గ్రామంలో ఈవీఎంలు మొరాయించడంతో రాత్రి 8.30 వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఇంకా క్యూలైన్లో 70 మంది ఓటర్లు ఓటు వేయడానికి నిల్చున్నారు. పోలింగ్ సరళిని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పర్యవేక్షించారు.