మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 7 : గురువారం నుంచి పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఈ పరీక్షల కోసం మహబూబ్నగర్లోని స్టేడియం మైదానం సిద్ధమైంది. ఏర్పాట్లను ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎం.చేతన(ఐపీఎస్) పరిశీలించారు. మైదానంలో రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సార్ పద్ధతులతో పరుగు పోటీలు, లాంగ్జంప్ షాట్పుట్, ఎత్తు, బరువు, ఛాతి కొలతలు తీసుకునే విధానంపై ట్రయల్న్ నిర్వహించారు. రన్నింగ్ ట్రాక్తో పాటు గ్రౌండ్ పరిస్థితులపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
దేహదారుఢ్య పరీక్షలు చేసే ఆయా పరికరాలను సంబంధిత అధికారులతో తనిఖీ చేయించారు. అంతకుముందు జరిగిన సమావేశంలో అధికారులు మాట్లాడుతూ అభ్యర్థులు సర్టిఫికెట్లు తనిఖీ మొదలు పరీక్షలు పూర్తయి బయటకు వెళ్లే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏమరుపాటు తగదని, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వారి వెంట నోడల్ ఆఫీసర్, అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.