ఖిల్లాఘణపురం, డిసెంబర్ 22 : మండలంలో రెండు చిరుత పులుల సంచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని మల్కిమియాన్పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న బోడగట్టుకు 50మీటర్ల దూరంలో రైతు గూడురు శ్రీనివాస్రెడ్డి తన షెడ్డులో పాడి పశువులను పెంచుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 5గంటలకు రోజుమాదిరిగానే పాలు పితకడానికి షెడ్డు వద్దకు వెళ్లగా అక్కడే ఉన్న కుక్కలు అరవడం మొదలు పెట్టాయి. కుక్కలు గుంపుగా గుట్టవైపు అరుస్తు పరుగెత్తాయి. చిరుత పులుల గాండ్రింపులకు భయపడిన కుక్కలు వెనక్కి రావడంతో శ్రీనివాస్రెడ్డి టార్చ్ లైట్ వేయగా రెండు చిరుత పులులు గుట్ట పక్కనే ఉండడం గుర్తించాడు. వెంటనే గ్రామస్తులకు తెలుపడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని చూడగా రెండు చిరుతపులులు గ్రామస్తులు చూడగానే బోడగట్టుపైకి వెళ్లాయి.
వారు వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు గ్రామస్తులతో కలిసి చుట్టు కేకలు వేస్తు పరిసరాలను పరిశీలించారు. గ్రామానికి ఆనుకొని ఉన్న బోడగట్టుపైకి వెళ్లి చూశారు. అక్కడక్కడ చిరుత పులుల పాదముద్రలు కనిపించడంతో వాటిని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. పశువుల కాపరులు ఒక్కరొక్కరుగా పశువులను మేపేందుకు వెళ్లకూడదని, అటవీ ప్రాంతానికి వెళితే ఇద్దరు లేదా ముగ్గురు వెళ్లడం మంచిదని అధికారులు సూచించారు. చిరుత పులుల సంచారం ఉంటే వెంటనే పైఅధికారులకు సమచారం అందించి వాటిని పట్టుకునేందుకు బోన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారిలో ఫారెస్ట్ అధికారులు భాస్కరాచారి, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
మూగజీవాలపై చిరుత దాడి
మండలంలోని యన్మన్గండ్ల గ్రామ శివారులో ప్రాంతాల్లో చిరుత గురువారం రాత్రి మూగజీవాలపై దాడి చేసింది. అటవీ ప్రాంతాన్ని వదిలి చిరుత జనావాసాల్లోకి రావడంతో చుట్టు పక్కల గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతుల సమాచారం ప్రకారం.. యన్మన్గండ్ల గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో రాత్రి చిరుత సంచరించి అదే గ్రామానికి చెందిన పాశం రమేశ్కు చెందిన పశువుల పాక వద్దకు వెళ్లి గేదే దూడపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. అలాగే పక్కనే గల బ్యాగరి శ్రీనివాసులు పశువుల కొట్టం వద్దకు వెళ్లి అందులో ఉన్న రెండు లేగదూడలపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. కొంత దూరంలో ఉన్న రుద్రారం గ్రామానికి చెందిన బాల్ చెన్నయ్య పశువుల కొట్టంపై దాడి చేసి లేగ దూడను గాయపర్చింది. ఉదయం పశువుల పాకకు వెళ్లి దాడికి గురైన దూడలను చూసి రైతులు ఒక్క సారిగా అవాక్కయ్యారు. రాత్రి వేళల్లో అదే ప్రాంతంలో రైతులు వ్యవసాయ పొలాల్లో సంచరిస్తూ ఉంటారు. ఒక వేళ చిరుత కంట పడితే తమ పరిస్థితి ఏంటని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి చిరుత దాడులనుంచి తమను, పశువులను కాపాడాలని రైతులు కోరుతున్నారు.