పెబ్బేరు, ఏప్రిల్ 18 : ప్రస్తుతకాలంలో సాఫ్ట్వేర్, వైద్యం, ఇంజినీరింగ్ వంటి రంగాలపై విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో మనం కూడా ఎక్కువగా ఆ చదువుల గురించే వింటున్నాం. ఇక వ్యవసాయం, పశుజాతికి సంబంధించి కూడా కోర్సులున్నాయి. అదేవిధంగా చేపలకు సంబంధించి ప్రత్యేక కోర్సులు, కాలేజీలు ఉన్నట్లు చాలామందికి తెలియదు. అసలు చేపలకు సంబంధించిన కోర్సు కూడా ఉంటుందా అని అనుకునేటోల్లకు సమాధానమే.. పెబ్బేరులోని ఫిషరీస్ సైన్స్ కాలేజీ.
ఇది రాష్ట్రంలోనే ఏకైక కళాశాల. రాష్ట్ర విభజనకు ముందు ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూరులో మాత్రమే ఈ కాలేజీ ఉండేది. ఉమ్మడిరాష్ట్రంలోని విద్యార్థులంతా అక్కడికి వెళ్లి చదువుకునేవారు. మనకంటూ సొంతరాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కృషి ఫలితంగా వనపర్తి జిల్లాలోని పెబ్బేరులో మత్స్య కళాశాల ఏర్పాటైంది. పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం వారు 2017లో ఇక్కడ ఫిషరీస్ సైన్స్ కాలేజీని ప్రారంభించారు. మొదట్లో తాత్కాలిక భవనాల్లో మొదలైన తరగతులు, హాస్టల్.. ప్రస్తుతం 27 ఎకరాల విస్తీర్ణంలో, రూ.31కోట్లతో నిర్మిస్తున్న సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. నాలుగేండ్ల ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులో ప్రస్తుతం 84మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో 60మంది బాలికలు ఉండగా 24మంది బాలురున్నారు. ఊరికి దూరంగా పచ్చని పంటల మధ్య అహ్లాదకర వాతావరణంలో కళాశాల తరగతులు కొనసాగుతున్నాయి.
మత్స్య సంపద పెంచడమే లక్ష్యంగా..
మత్స్య సంపదను పెంచాలనే లక్ష్యంతో రాష్ట్రంలో మొదలైన నీలివిప్లవం.. ప్రస్తుతం పరిశ్రమగా అభివృద్ధి చెంది ఉపాధి మార్గంగా నిలుస్తున్నది. అదేవిధంగా మానవాళికి పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నది. చేపల పెంపకంపై పరిశోధనలను అభివృద్ధి చేసేందుకు ఈ కళాశాల దోహదపడుతోంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు మత్స్యశాస్త్ర భోదనతోపాటు పరిశోధన, మత్స్య కార్యకలాపాల విస్తరణ అంశాలపై బోధనలు, ప్రయోగాలుంటాయి. అలాగే మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణ, పురోగతి, విస్తరణ వంటి కార్యక్రమాలు చేపడతారు. విద్యార్థులను సుశిక్షితులను చేసి రాష్ట్ర, దేశ మత్స్యసంపద అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా తర్ఫీదునిస్తారు.
విద్యార్థుల ఎంపిక ఇలా..
ఎంసెట్లో మెరిట్ ఆధారంగా ఫిషరీస్ సైన్స్ కాలేజీకి విద్యార్థులను ఎంపిక చేస్తారు. నాలుగేండ్ల ప్రొఫెషనల్ కోర్సులో ఏడాకి 25మంది విద్యార్థులనే తీసుకుంటారు. ఈ కోర్సులో మొదటి మూడేండ్లు తరగతిగదిలోనే బోధనం ఉంటుంది. నాలుగో ఏడాది మాత్రం ఖమ్మం జిల్లా పాలేరులోని మత్స్య పరిశోధన సంస్థకు పంపించి శిక్షణ ఇస్తారు. అనంతరం ఎర్న్ వైల్ యూ లెర్న్ (నేర్చుకుంటూనే సంపాదించకోవడం) విధానంలో పనిచేయిస్తూ పారిశ్రామిక అభివృద్ధిలో పాలుపంచుకొనేలా విద్యార్థులు తయారుచేస్తారు. డిగ్రీ కోర్సు పూర్తయ్యాక, పీజీ, పీహెచ్డీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కళాశాలలో అసోసియేట్ డీన్తోపాటు ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు కాంట్రాక్టు పద్ధతిన అధ్యాపకులు పనిచేస్తున్నారు. భోదనకు మరింతమంది అధ్యాపకుల అవసరం ఉన్నది.
చేపల చెరువు వద్ద ప్రయోగాత్మక విద్యాబోధన
ఉపాధికి అవకాశాలు..
మూస విద్యలకు భిన్నంగా రాణించాలన్నా.. జీవితంలో త్వరగా స్థిరపడాలన్నా మత్స్యశాస్త్ర విద్య ఎంతో దోహదపడుతుందని అధ్యాపకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆక్వాకల్చర్, ఆక్వాటెక్, యానిమల్ హెల్త్ మేనేజ్మెంట్, అక్వాటెక్ ఎన్విరాన్మెం ట్, ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫిషరీస్ ఇంజినీరింగ్, ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీతోపాటు ఎకనామిక్స్ అండ్ ఎక్స్టెన్షన్ కోర్సుల ను బోధిస్తున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు మత్స్య అభివృద్ధి అధికారులుగా, ఫిషరీస్ ఇన్స్పెక్టర్లుగా ప్ర భుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్ రంగంలో టెక్నికల్ ఆ ఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో శాస్త్రవేత్తలు గా, సహాయ ఆచార్యులుగా రాణించవచ్చు. ముఖ్యంగా స్వయం ఉపాధితోపాటు, ప్రైవేటు రంగంలో అపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా జాతీయ మత్స్య అభివృద్ధి మండలి వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు విద్యార్థులకు ఆర్థికసాయం అందజేస్తున్నది.
రూ.31కోట్లతో సొంత భవనాలు
2017లో పెబ్బేరుకు ఫిషరీస్ కాలేజీ మంజూరు కాగా కొన్నేండ్లపాటు తాత్కాలిక భవనాల్లో తరగతులు నిర్వహించారు. అనంతరం 27 ఎకరాల్లో, రూ.31కోట్లతో సకల హంగులతో కళాశాల భవనాన్ని నిర్మించారు. 2021 సెప్టెంబర్లో అప్పటివరకు పూర్తయిన వసతిగృహాలు, మెస్ భవనాలను పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం సకల వసతులతో పూర్తిస్థాయి పరిపాలనా భవనం, తరగతి గదుల నిర్మాణం కొనసాగుతున్నది. విద్యార్థులకు అవసరమైన చేపల చెరువులను కూడా ఏర్పాటు చేశారు. పెబ్బేరుకు మత్స్యశాస్త్ర కళాశాల రావడంతో, ఈ ప్రాంతానికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కళాశాలలో తెలంగాణ, ఏపీ విద్యార్థులు చదువుతున్నారు.
ఉపాధి అవకాశాలు ఎక్కువ
మత్స్యశాస్త్రం కోర్సుపై అవగాహన పెరగాలి. ఇలాంటి కోర్సు ఉన్నట్లు చాలా మందికి తెలియదు. ప్రచార లోపంతో రాష్ట్రంలో కళాశాల ఉందన్న విషయం తెలియక చాలామంది విద్యార్థులు ఏపీతోపాటు ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నారు. ఇతర కోర్సులతో పోల్చి చూస్తే మత్స్యశాస్ర్తానికి ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు దీనిని సువర్ణావకాశంగా మలుచుకోవచ్చు. రెగ్యులర్ కోర్సులకు భిన్నంగా ఎంతో ప్రత్యేకతను నిలిపే కోర్సు ఇది.
– డాక్టర్ భానుప్రకాశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్
మంచి భవిష్యత్ ఉంటుంది
దేశంతోపాటు రాష్ట్రం మత్స్యరంగం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. ఈ నేపథ్యంలో మత్స్యశాస్త్రం కోర్సుకు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలోనే ఏకైక మత్స్య కళాశాల కావడంతో విద్యార్థులకు సరిపడా సీట్లు లేనందున.. సీట్ల సంఖ్య పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. విద్యార్థులకు హాస్టల్తోపాటు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నాం. మా విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. కోర్సు పూర్తి చేసిన వారు చాలా చోట్ల స్థిరపడ్డారు. ఈ కోర్సు ఎంచుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
– డాక్టర్ నాగలక్ష్మి, అసోసియేట్ డీన్