గద్వాల : ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరవుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు ( Better Service ) అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Collector Rizwan Basha ) ఆదేశించారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలిస్తూ రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలు, మందులు, ల్యాబ్ రిపోర్టులు, సర్జరీలు వంటివి వివరంగా తెలుసుకున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులతో పాటు నర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ, శానిటేషన్ సూపర్వైజర్లు , ఇతర సిబ్బంది వంద శాతం హాజరు ఉండాలన్నారు. ప్రతి రోజు హాజరు వివరాలు తప్పనిసరిగా బయోమెట్రిక్ వ్యవస్థ ద్వారా నమోదు చేయాలని ఆదేశించారు. బయోమెట్రిక్ లో ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే రెండు రోజుల్లో పరిష్కరించాలన్నారు. ఆసుపత్రిలోని కొన్ని వార్డులలో ఫ్యాన్లు పనిచేయడం లేదని గమనించి, వాటిని వెంటనే సరి చేయించాలని ఆదేశించారు.
రోగులకు వేగంగా వైద్య సేవలు అందేలా టోకెన్ సిస్టమ్ అమలు చేయాలన్నారు. ఆసుపత్రి టాయిలెట్లు ప్రతి రెండు గంటలకు ఒకసారి శుభ్రం చేసి చార్ట్ లో రాయాలని, ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా, పిచ్చి మొక్కలు లేకుండా ఉంచాలని శానిటేషన్ అధికారులకు ఆదేశించారు. ల్యాబ్, రేడియాలజీ , డయాగ్నోస్టిక్ సెంటర్స్ను పరిశీలించి, ల్యాబ్ రిపోర్టులు, ఎమర్జెన్సీ టెస్టులు త్వరగా పూర్తి చేసి రోగులకు అందజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్ఎంవో హేమలత, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.