గండీడ్, జనవరి 11 : అన్నిశాఖల అధికారులు బాధ్యతగా పనిచేసి ప్రజాసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ మాధవి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించమన్నారు.
గ్రామాల్లో పచ్చదనం, శుభ్రతను పెంచేందుకు ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నదని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. అలాగే డంపింగ్యార్డులను సద్వినియోగం చేసుకొని చెత్త నుంచి సంపద సృష్టించాలని సూచించారు. అన్ని గ్రామపంచాయతీల్లో పెద్దఎత్తున మొక్కలను నాటేందుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. కాగా అంతకుముందు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, కోఆప్షన్ సభ్యుడు సలీం, ఎంపీడీవో రూపేందర్రెడ్డి, తాసిల్దార్ జ్యోతి తదితరులు ఉన్నారు.