పాలమూరు, ఏప్రిల్ 7 : పాలమూరు విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా ఎదుగుతున్నది. సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలతోనే ప్రారంభమైన యూనివర్సిటీ క్రమంగా పలు రకాల కోర్సులతో ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నది. ప్రస్తుతం పీయూ సిగలో ఉపాధి, ఉద్యోగ కోర్సులైన ఇంజినీరింగ్, లా కళాశాల ఏర్పాటుకు అడుగులు పడుతుండడంతో పాలమూరు ఎడ్యుకేషన్ హబ్గా మారనున్నది. ఈ మేరకు ఆయా కళాశాలల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నుంచి పీయూ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో రెండు కళాశాలల ఏర్పాటు కల త్వరలోనే సాకారం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వం లా, ఇంజినీరింగ్ కళాశాలలు లేకపోవడంతో వాటిని ఏర్పాటు చేయాలని కొన్ని రోజులుగా పీయూలోని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయడంతోపాటు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా పలువురు ప్రజాప్రతినిధులకు కూడా వినతిపత్రాలు అందజేశారు. మొదట ఇంజినీరింగ్ కళాశాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు పీయూలో ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు కళాశాలల ఏర్పాటుకు దాదాపు రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏ ర్పాటుకు సంకేతాలు రావడంతో అందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు రూపొందిస్తున్నారు. మొదట రెండు కళాశాలలకు భవనాలు అవసరమవుతాయి. లా కళాశాలలో కేవలం ఒక్క కోర్సు మాత్రమే ఉండగా, ఇందుకు సంబంధించి ఇప్పటికే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి డిపార్ట్మెంట్ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి.
ఇక ఇంజినీరింగ్లో పలు కోర్సుల తరగతుల నిర్వహణకు గదులు, ల్యాబ్లు, లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు రెండు కళాశాలల్లో పనిచేసేందుకు టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందిని నియమించాల్సి ఉన్నది. వీరికి చెల్లించే వేతనాలు, ఇతర ఖర్చుల పూర్తి వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వివరాలన్నింటినీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి పీయూ అధికారులు త్వరలో నివేదిక అందించనున్నారు.
లా కోర్సుకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉండగా ఉమ్మడి జిల్లాలో ఒక్క ప్రైవేట్ కళాశాలలో మినహా ఎక్కడా ఆ కోర్సు లేదు. ఇంజినీరింగ్తో పాటు డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, మెషిన్ లర్నింగ్ తదితర డిమాండ్ ఉన్న కోర్సుల ఏర్పాటుకు ప్ర తిపాదలనలు పంపించనున్నట్లు సమాచారం. సూ మారు 4 నుంచి 6 కోర్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. విద్యార్థుల చదువు లు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా డిమాండ్ ఉన్న వాటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.