అలంపూర్, జనవరి 31 : ఐదో శక్తి పీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల చరిత్ర, ప్రాశస్త్యం నలుదిశలా వ్యాపించాలని, దక్షిణకాశీగా విరాజిల్లుతున్న అలంపురం క్షేత్రం దినదినాభివృద్ధి చెందాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు, ఈవో పురేందర్కుమార్తో కలిసి ఎమ్మెల్యే విజయు డు వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్, ఫ్లెక్సీని విడుదల చేశారు.
ముందుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 14న వసంత పంచమి అ మ్మవారి ప్రాణప్రతిష్ట చేసిన శుభదినాన్ని పురస్కరించుకొని ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ఆలయ పాలక మండలి సభ్యులతోపాటు అర్చకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.