‘పాలమూరు’ ఎత్తిపోతల పనులకు అడ్డంకులు తొలగాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులకు సుప్రీం కోర్టు లైన్క్లియర్ చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్కు ఊరట లభించింది. ఎన్జీటీ తీర్పుపై దేశంలోని అత్యున్నత న్యాయస్థానం స్టే విధిస్తూ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో స్టేకు సంబంధించిన ప్రతులు ఇరిగేషన్ అధికారులకు అందనున్నాయి. వీటిని ప్రభుత్వానికి నివేదించిన అనంతరం పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఇక లిఫ్ట్ పనులు చకచకా జరగనున్నాయి. 7.15టీఎంసీలు తాగునీటికి వాడుకునే వెసులుబాటు కలిగింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు రైతులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్నగర్, ఫిబ్రవరి 19 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ) పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పుపై దేశ సర్వోత్తమ న్యాయస్థానం స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.500 కోట్ల జరిమాన విధిస్తూ ఇచ్చిన తీర్పుపై కూడా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నుంచి స్టేకు సంబంధించిన ప్రతులు అందిన వెంటనే ప్రాజెక్ట్ అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు ప్రారంభించనున్నారు. దీంతో ఆ ప్రాజెక్టుకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగించడమే కాకుండా సాగు, తాగునీరు అందించేందుకు పీఆర్ఎల్ఐ చేపడుతున్నామని గతంలోనే కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు నికర, వరద, మిగులు జలాలు వాడుకునేందుకు ఈ ఎత్తిపోతల చేపడుతున్నట్లు సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ వాటాకు అనుగుణంగానే ప్రాజెక్ట్ పనులు చేపట్టినట్లు వివరించింది. కొంతమంది కావాలని గ్రీన్ ట్రిబ్యూనల్ ఆశ్రయించడంతో స్టే ఇచ్చిందని పేర్కొంది. దీంతో 7.15 టీఎంసీలను తాగునీటి కోసం వినియోగించుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది. ఈ క్రమంలో నిలిచిపోయిన పీఆర్ఎల్ఐ పనులు ప్రారంభం కానున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే పై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లాలో సాగు, తాగు నీరు అందకుండా కొంతమంది చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీం కోర్టు స్టే చెంప దెబ్బలాంటిదంటున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సాగు, తాగునీరు అందించేందుకు చేపట్టిన పీఆర్ఎల్ఐ చేపట్టాలని తెలంగాణ రాకముందు నుంచే ఎన్నికల హామీగా ఉన్నది. అనేకసార్లు ఈ పథకాన్ని నాన్చుతూ వచ్చి చివరకు శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి ఏడాది పొడవునా ఉపయోగించుకునేలా డిజైన్ చేశారు. ఈ ఎత్తిపోతల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు రూపకల్పన చేయలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో పీఆర్ఎల్ఐకి తుదిరూపు ఇస్తూ ఆమోదముద్ర వేసింది. రూ.35,200 కోట్ల వ్యయంతో 2015 జూన్ 10న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రాజెక్ట్ను రెండు దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో నీటిని తరలించడానికి పంప్హౌజ్లు, జలాశయాలు, పైప్లైన్లు, కాల్వలు, సొరంగాలు నిర్మించి తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తారు.
ఎన్జీటీ ఇచ్చిన తీర్పు, జరిమానపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం ప్రాజెక్ట్ ఆవశ్యకతపై గత శుక్రవారం సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించింది. ఇందుకుగానూ ఎన్జీటీ జరిమాన, తీర్పుపై ధర్మాసనం స్టే విధించింది. తక్షణ అవసరాల కింద తాగునీటికి ఇబ్బంది లేకుండా 7.15 టీఎంసీలను వాడుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా తాగునీటి అవసరాలకు ఉపయోగించే ప్రాజెక్ట్ పనులకు పచ్చజెండా ఊపింది. సుప్రీంకోర్టు స్టేతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కేంద్రం కృష్ణా జలాలపై వాటా తేల్చనందుకే ఈ ఎత్తిపోతలపై అడ్డంకులు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా జలాల్లో సుమారు 600 టీఎంసీల నికరజలాలు తెలంగాణకు న్యాయంగా రావాల్సి ఉన్నది. కేంద్రం కృష్ణా బోర్డుకు సూచించి.. వాటా తేలిస్తే మరో రెండు ప్రాజెక్టులు కూడా నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు అంటున్నారు.
ఏపీ, తెలంగాణ విడిపోయి ఎనిమిదేం డ్లు అవుతున్నా.. కేంద్ర ప్రభుత్వం రా ష్ట్రంపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నది. కృ ష్ణానది జలాల వాటా తేల్చకుండా నాటకా లు ఆడుతున్నది. తెలంగాణలోని అనేక ప్రాంతాలు బీళ్లుగా ఉండాలని ఏపీతో కు మ్మక్కై రాజకీయం చేస్తున్నది. ఇక్కడి బీజేపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే కేం ద్ర ప్రభుత్వంతో పోరాడి వాటా తేల్చేలా ఒ త్తిడి చేయాలి. తెలంగాణ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సరైనదని భావించి ఎన్జీ టీ తీర్పుపై స్టే ఇవ్వడం శుభపరిణామం. ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగినట్లే. బీజేపీ నేతల చిత్తశుద్ధి ఏంటో ఉమ్మడి జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. ఆరునూరైనా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి తీరుతాం.