మహబూబ్నగర్ : అధికార కాంగ్రెస్ నాయకులు ( Congress Leaderss ) అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, వారిబెదిరింపు రాజకీయాలకు తాము భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నాయకులు ( BRS leaders ) స్పష్టం చేశారు. తాము అవినీతి చేసినట్లు నిరూపిస్తే ఆస్తులు అమ్మి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ జడ్పీటీసీ చిక్కొండ శ్రీశైలం( Srisailam) , కట్ట వంశీ గౌడ్( Vamsigoud ) తెలిపారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. తన ఆర్థిక నేపథ్యాన్ని, పనుల వివరాలను శ్రీశైలం మీడియా ముందుంచారు . తనకు 10 ఎకరాల పొలం ఉంది. 2007లోనే ప్రైవేట్ స్కూల్ పెట్టాను. నాకు అన్ని లోన్స్ ఉన్నాయి, మరి రమణ రావుకు ఈఎంఐ లేకుండా కారు ఎలా వచ్చిందో వివరించాలని డిమాండ్ చేశారు.
మిషన్ భగీరథ పనులు తాను చేసింది కాదని వెల్లడించారు.మిషన్ భగీరథ బిల్లులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే నిలిపి వేసిందని, తాము చేసిన సీసీ రోడ్డు పనులన్నీ పర్ఫెక్ట్గా జరిగాయని తెలిపారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చామని, అడ్డుగోలుగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నాయకుడు కట్ట వంశీ గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీ మాజీ సర్పంచ్ స్వామి రాత్రి ఫోన్ చేసి తీవ్ర పదజాలంతో దూషిస్తూ, మీడియా ముందు చెప్పుకోలేని అసభ్యకరమైన మాటలు మాట్లాడారని, చంపుతానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన ప్రాణానికి ఏ హాని జరిగినా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ సర్పంచ్ స్వామిలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.