మూడు నెలలుగా పట్టించుకోని అధికారులు
ఇంటి నుంచి తెచ్చుకుంటున్న విద్యార్థులు
కోస్గి, మార్చి 17 : ప్రభుత్వం ఓ వైపు రూ.కోట్ల నిధులు ఖర్చు చేసి పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తుం టే.. కోస్గి మండలం మాసాయిప ల్లి బడిలో మాత్రం మూడు నెలలుగా ఈ పథకం అమలు కావ డం లేదు. గత డిసెంబర్ నుంచి మధ్యాహ్న భోజనం వండేవారు లేకపోవడంతో విద్యార్థులు పస్తులు తప్పడం లేదు. అక్కడి ఉపాధ్యాయులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయకపోవడంతో విద్యార్థులు ఇండ్ల నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. సర్కార్ సరుకులు అందిస్తున్నా.. వండేవారు లేరనే సాకుతో భోజనం నిలిపివేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై డీఈవో లియాకత్ అలీని వివరణ కోరగా.. మాసాయిపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టడం లేదన్న విషయం తన దృష్టికి రాలేదని తెలిపాడు. సంబంధిత హెచ్ఎం గానీ.. ఎంఈవో గానీ ఈ విషయాన్ని నాకు తెలియజేయాలని చెప్పారు. వివరాలు సేకరించి త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.