కొల్లాపూర్, మార్చి 1: బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎన్నికల సమయంలో హస్తం గూటిలో చేరిన కొల్లాపూర్ వైస్ ఎంపీపీ సభావట్ భోజ్యానాయక్పై బీఆర్ఎస్ ఎంపీటీసీలు శుక్రవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు నెగ్గింది. గత నెల 6వ తేదీన వైస్ ఎంపీపీ సభావట్ భోజ్యానాయక్పై అవిశ్వాసానికి ఆరుగురు ఎంపీటీసీలు సంతకాలు చేసి స్థానిక ఆర్డీవోకు నోటీసు అందజేశారు. కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశాల మేరకు అవిశ్వాసానికి తేదీని, ఎన్నికల అధికారిగా ఆర్డీవో నాగరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు ఎంపీపీ సమావేశ మందిరంలో ఓటింగ్కు హాజరుకావాలని ఆర్డీవో ఎంపీటీసీలకు ఉత్తర్వులు జారీ చేశారు. సదరు అధికారుల సమక్షంలో ఎంపీటీసీలు మంజుల(ఎల్లూరు), రజితా భాస్కర్గౌడ్(ఎంపీపీ-ఎన్మన్బెట్ల), నాగేంద్రమ్మ(చింతలపల్లి), వరలక్ష్మి (రామాపురం), కొండ్రబుచ్చయ్య (కుడికిళ్ల), పాండూనాయక్(నార్లాపూర్), శంకర్నాయక్(బోడబండతండా)పార్మెట్లో సంతకాలను చేశారు.
అయితే సదరు హాజరైనవారంతా ఎంపీటీసీ సభ్యులేనా కాదా గుర్తించి ధ్రువీకరించమని ఆర్డీవో నాగరాజు ఎంపీడీవోకు సూచించారు. అందుకు ఎంపీడీవో అందరూ ఓకే అని చెప్పారు. అవిశ్వాసానికి కోరం కావాలంటే ఆరుగురు సభ్యులు అవసరం ఉండగా ఏడుగురు సభ్యుల మద్దతు ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపు ప్రకటించారు. అవిశ్వాసానికి అనుకూలంగా శంకర్నాయక్ ప్రతిపాదించగా కొండ్ర బుచ్చయ్య మొదటి సెట్లో బలపర్చారు. రెండో సెట్లో పాండూనాయక్ ప్రతిపాదించగా ఎస్ మంజుల బలపర్చారు. దీంతో వైస్ ఎంపీపీ భోజ్యానాయక్పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఏడుగురు సభ్యులు ఒకే వైపు చేతులెత్తారు. దీంతో ఎన్నికల కమిషన్ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వైస్ఎంపీపీ పదవి ఖాళీగా ఉంటుందని, ఎన్నికల అధికారి, ఆర్డీవో నాగరాజు ప్రకటించారు. సమావేశంలో ఎంపీడీవో పట్టాభిరామారావు, తాసీల్దార్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ శేఖర్గౌడ్, డీటీ ప్రభాకర్ పాల్గొన్నారు.