మోర్తాడ్, డిసెంబర్ 18: పోటీల్లో విజేతలైన వారిపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తారు. అయితే అతని విజయం వెనుక గురువు పడిన కష్టాన్ని గమనించరు. తల్లిదండ్రులు జీవితాన్నిస్తే దానికి సార్థకత కల్పించేది ఉపాధ్యాయులే. తమ శిష్యుల అభ్యున్నతికి పరితపిస్తూ గురువులను మించిన శిష్యులుగా వారిని తయారు చేయడానికి నిత్యశ్రామికులుగా పనిచేస్తుంటారు వారు. చాలా మంది క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించేలా తీర్చిదిద్దుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు తిమ్మాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుడు శ్యామ్.
తనకు ఇష్టమైన బాల్ బ్యాడ్మింటన్ క్రీడను సాధన చేస్తూనే మేటి క్రీడాకారులను తయారుచేస్తూ వారు జాతీయస్థాయిలో రాణించేలా కృషి చేస్తున్నారు మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ ఉన్నత పాఠశాల పీఈటీ శ్యామ్. ఆటలపై ఎంత ఆసక్తి ఉన్న ఏం లాభం…ఆ ఆటకు సంబంధించిన పూర్తిస్థాయి అవగాహన కల్పించడం, ఆటలో ఉన్న మెళకువలను తెలియజేస్తూ ఆటను ఏవిధంగా ఆడాలో చెప్పే వారు ఉంటేనే ఆ ఆటలో తప్పనిసరిగా ప్రావీణ్యాన్ని సాధిస్తారు. క్రీడలకు సంబంధించి కోచ్ ఉంటే ఆటతీరు మెరుగుపడడం, తమ సామర్థ్యాన్ని చాటడం జరుగుతుందనేది తెలిసిందే. ప్రస్తుతం తిమ్మాపూర్ ఉన్నతపాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న శ్యామ్.. విద్యార్థులకు బాల్బ్యాడ్మింటన్లో కోచ్గా వ్యవహరిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేలా శిక్షణ ఇస్తున్నారు.
రాష్ట్ర, జాతీయస్థాయికి 38 మంది విద్యార్థులు
మోర్తాడ్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన శ్యామ్ 2009లో మెండోరా పీఈటీగా ఉద్యోగంలో చేరారు. బాల్బ్యాడ్మింటన్లో సీనియర్ క్రీడాకారుడు కావడంతో ఆటలో ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకొని గ్రామస్తుల సహకారంతో వారికి ప్రత్యేక శిక్షణను ఇచ్చేవారు. ప్రస్తుతం తిమ్మాపూర్ ఉన్నత పాఠశాల పీఈటీగా కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా విద్యార్థులకు బాల్బ్యాడ్మింటన్లో కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు శ్యామ్ వద్ద కోచింగ్ తీసుకున్న 38మంది విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఆడారు. మెండోరా పాఠశాల నుంచి 20 మంది రాష్ట్రస్థాయిలో, నలుగురు జాతీయస్థాయిలో ఆడారు. తిమ్మాపూర్ పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి, నలుగురు జాతీయస్థాయికి ఆడడం విశేషం. ప్రస్తుతం జిల్లా బాల్బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న శ్యామ్ శిక్షణలో తిమ్మాపూర్ విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించారు. ఈయన శిక్షణలో ఇద్దరు విద్యార్థినులు వ్యాయామ ఉపాధ్యాయులుగా ఎంపికై ఉద్యోగాల్లో చేరారు. ఈయన పనిచేస్తున్న పాఠశాలలో ఏటా వేసవిశిక్షణ తరగతులను నిర్వహిస్తూ బాల్బ్యాడ్మింటన్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.
పాత రోజులు రావాలి..
బాల్బ్యాడ్మింటన్కు గతంలో ఉన్న గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఈ ఆటపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకొని ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాను. ఇప్పటి వరకు నేను పనిచేసిన మెండోరా, తిమ్మాపూర్ పాఠశాలలకు చెందిన 38మంది విద్యార్థులు బాల్బ్యాడ్మింటన్లో రాష్ట్ర, జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు నా వంతు కర్తవ్యంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమే.
– శ్యామ్, పీఈటీ